అమరావతి: మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థించిన సినీ నటుడు చిరంజీవిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ గడ్డపై ఉంటూ సినిమాలు, వ్యాపారాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి అని ప్రశ్నించారు. ఓవైపు తమ్ముడు (పవన్ కల్యాణ్) ప్రజల కోసం పోరాడుతుంటే ప్రోత్సహించాల్సింది పోయి, మరో రాగం ఆలపిస్తున్నారని విమర్శించారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుచేసి, దాన్ని మరో పార్టీలో విలీనం చేశారని, ఆపై మంత్రి పదవి దక్కించుకుని రాష్ట్ర విభజన పాపంలో భాగమయ్యారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి వైఖరి చూస్తుంటే మళ్లీ దూకేస్తాడేమో అనిపిస్తోందని అన్నారు. ఈ మేరకు సోమిరెడ్డి ట్వీట్ చేశారు.
https://twitter.com/Somireddycm/status/1208664088118624256
కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఫార్ములాకు కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ డాక్టర్ కె చిరంజీవి మద్దతు పలికారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చిరు పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే.