అమరావతి: ఆర్టికల్ 360 కింద ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎనిమిది నెలల్లో వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రగతి గుండుసున్నా అని విమర్శించారు. ఆదాయం పడిపోవడమే కాకుండా రెవిన్యూ వ్యయం పెరిగిందన్నారు. మూలధన వ్యయం రూ.10,486 కోట్లు తగ్గిందని, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవ్వడమే కష్టం అయ్యిందన్నారు. సంక్షేమంపై వ్యయం రెండు వేల కోట్లు తగ్గించారని, పేదల సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. వచ్చే ఆదాయం అంతా జీతాలు, పెన్షన్లకే సరిపోతుందని, అభివృద్ది పనులకు, సంక్షేమానికి పైసా లేదని యనమల విమర్శించారు. టిడిపి ప్రభుత్వ పథకాలను రద్దు చేశారని, వైసీపీ ప్రభుత్వం చేతగానితనంతో రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు.
రెవిన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ విపరీతంగా పెరిగాయని, ఆహార ద్రవ్యోల్బణం ఐదు శాతంపైగా పెరిగిందన్నారు. తలసరి ఆదాయం రెండేళ్ల దిగువకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు పెరిగడంతో కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో అభివృద్దిని రివర్స్ చేశారని, దానితో పేదల సంక్షేమం కూడా రివర్స్ అయ్యిందని విమర్శించారు. రాజకీయ సంక్షోభంలో వైసీపీ చిక్కుకుందన్నారు. ఇన్ని సమస్యలున్నా సీఎం జగన్ చిద్విలాసంగా ఉన్నారన్నారు. పైశాచిక ఆనందంలో మునిగితేలుతున్నారని, ఒక్కఛాన్స్ వచ్చింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశానన్న పిచ్చి ఆనందమే ఆయనకు మిగిలిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.35,260కోట్లు ఉంటే, ఎనిమిది నెలల్లోనే రూ.35వేల కోట్ల అప్పులు చేశారన్నారు. రాబోయే నాలుగు నెలల్లో ఇంకెంత అప్పు చేస్తారో తెలీని దుస్థితి నెలకొందని యనమల చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్కదిద్దే సామర్ధ్యం వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. ఈ ఏడాది అప్పుల అంచనా రూ.68 వేల కోట్లు ఉంటే, వైసిపి నిర్వాకాలతో ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు.
‘మొన్న ఇసుక కోసం ఆందోళనలు, నిన్న గిట్టుబాటు ధరల కోసం ఆందోళనలు, ఇప్పుడు రాజధాని కోసం ఆందోళనలు.. ఈ ఆందోళనలతో రాష్ట్రంలో పెట్టుబడుల వ్యతిరేక వాతావరణం. రాజధానిపై అయోమయం సృష్టించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అంటూ జగన్ రాష్ట్రంలో గందరగోళం సృష్టించారని, టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులను తరిమేశారని యనమల ఆరోపించారు. యువత ఉపాధి అవకాశాలను పోగొట్టారన్నారు. సంపద సృష్టి అవకాశాలన్నీ మూసుకుపోయాయని, అన్ని శాఖల్లో ఆర్ధిక అస్థిరత ఏర్పడిందన్నారు. క్రెడిట్ అవకాశాలు నీరుగారి పోయాయని, తక్షణం రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని యనమల రామకృష్ణడు డిమాండ్ చేశారు. వైసిపి నేతలు భూకబ్జాలు, ఇసుక దందాలు,మద్యం మాఫియాలో తలమునకలు అయ్యారని ఆరోపించారు. రాష్ట్రాన్ని రక్షించడం వైసిపి నేతలకు ఎటూ చేతకాదని, అందుకే ప్రజలే రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. ‘‘సేవ్ ఆంధ్రప్రదేశ్’’ నినాదం అన్నిచోట్ల ప్రతిధ్వనించాలని యనమల రామకృష్ణడు పిలుపునిచ్చారు.