అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడి నిండా నూరు రోజులు కాలేదు కానీ టిడిపి నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. వరుసగా ఆ పార్టీ నేతలపై కేసుల మీద కేసులు నమోదు అవుతుండటంతో అరెస్టుల నుండి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కోర్టుల నుండి ముందస్తు బెయిల్ లభించే వరకూ అజ్ఞాతంలోనే గడపాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు, కుమార్తెలపై కేసులు నమోదు కావడంతో పాటు ఆయనపైనా అసెంబ్లీ ఫర్నీచర్ కేసు నమోదు అయ్యింది. ఆయనపై కేసు నమోదు కావడంతో పాటు కుమారుడి షోరూమ్ నుండి అధికారులు అసెంబ్లీ ఫర్నీచర్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కోడెల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. తన వద్ద ఉన్న అసెంబ్లీ ఫర్నీచర్ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాననీ, లేదంటే వాటికి అయిన ఖర్చును ప్రభుత్వానికి చెల్లిస్తాననీ అసెంబ్లీ అధికారులకు కోడెల లేఖ రాసినట్లు వెల్లడించిన తరువాతే తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు అయ్యింది. కోడెల, ఆయన కుమారుడిపై నర్సరావుపేట, సత్తెనపల్లిలో నమోదైన కేసులకు హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ లభించింది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి నేత, మాజీ విప్ కూన రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగులపై అనుచితంగా మాట్లాడి దౌర్జన్యం చేశారంటూ కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు పది మంచి అనుచరులపైనా కేసు నమోదు చేశారు. తనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే మాదిరిగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయనున్నారన్న సమాచారంలో ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు అయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కరణం బలరాం ఒక వైసిపి నాయకుడిని దుర్భాషలాడి బెదిరించారన్న అభియోగంపై కేసు నమోదు చేశారు.
టిడిపి నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారనీ, వైసిపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందనీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు, తదితర నేతలు ఆరోపిస్తున్నారు. టిడిపి నేతలు తప్పుడు పనులు చేస్తూ దౌర్జన్యాలు చేయడం వల్లనే బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు అవుతున్నాయి కానీ దీనిలో వైసిపి ప్రభుత్వ ప్రమేయం ఏమీలేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.