అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ, టీడీపీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. విజయవాడలో మాజీమంత్రి కాల్వ, బుద్దా వెంకన్న, సీపీఐ నేత రామకృష్ణను హౌస్ అరెస్ట్ చేశారు. విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు, నల్లమిల్లి రామకృషారెడ్డి, నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
మరోవైపు పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న అమరావతి జేఏసీ సభ్యులు హోంమంత్రి సుచరిత ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. గుంటూరులోని ఆమె ఇంటిని ఈరోజు ఉదయం చుట్టుముట్టిన జేఏసీ సభ్యులు అనంతరం ఇంటి ఎదుట బైఠాయించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా, డేగ ప్రభాకర్, నజీర్, గోళ్ల ప్రభాకర్ తదితరుల ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు సుచరిత ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అరెస్టుచేసి నల్లపాడు స్టేషన్కు తరలించారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బ్యారేజ్ మీదకు అనుమతిస్తున్నారు. విజయవాడలోని ప్రధాన జంక్షన్లలో పోలీసులు పికెట్ విధించారు. గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియం ఎదుట విద్యార్ది జేఏసీ ఆందోళన చేపట్టారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా విద్యార్థి నేతలు నల్లబెలూన్లు ఎగురవేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నివాదాలు చేశారు.