(న్యూస్ ఆర్బిట్ డెస్క్
అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు పొలిటికల్ జెఎసి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో అర్థరాత్రి నుండే ముఖ్యనేతలందరినీ గృహ నిర్బంధం చేశారు. పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్లు అమలులో ఉన్నందున హైవేల దిగ్భంధనానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.అయినప్పటికీ జెఎసి హైవే దిగ్బంధనానికి సిద్ధమైంది. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, విజయవాడ ఎంపి కేశినేని నాని, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, 40మంది టిడిపి నేతలు, మంగళగిరి జెఎసి నేతలు, చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మరో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర (నాని), జనసేన నేత శ్రీనివాస్ యాదవ్, టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితర నేతలను హౌస్ అరెస్టు చేశారు. పలువురు నేతలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. చిన కాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధానికి నేతలు వెళ్లకుండా పోలీసులు వివిధ ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు.