అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఎన్ చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత తగ్గిస్తు వైయస్ జగన్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనకు తగినంత భద్రత కల్పించామని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఫ్యామిలీకి భద్రతను తగ్గించి.. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వైయస్ జగన్ ప్రభుత్వంపై వారు నిప్పులు చెరుగుతున్నారు. సమాచారం ఇవ్వకుండ బాబు ఫ్యామిలీకి భద్రత తగ్గించడం సరైన చర్య కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించన సంగతి తెలిసిందే. దాంతో టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకి భద్రతను కుదించారు. అయితే చంద్రబాబు తనయుడు లోకేశ్ బాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు కూడా జెడ్ ప్లస్ భద్రత ఉండేది. అంటే 5 + 5 భద్రత సిబ్బంది ఉండేది. అయితే వారిని 2 + 2 కి కుదించారు. దీంతో టీడీపీలో ఆందోళన మొదలైంది.
కాగా చంద్రబాబు.. తన ఫ్యామిలీలో కలసి ఇటీవలే విదేశీయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం వారు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే దీనిపై చంద్రబాబు స్పందించే అవకాశం ఉంది. అదీకాక.. చంద్రబాబు అటు విదేశీయాత్రకు వెళ్లారో లేదో.. ఇటు రాజ్యసభలోని నలుగురు టీడీపీ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత సైకిల్ పార్టీని కాషాయ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దాంతో విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు.. పార్టీ నాయకులతో భేటీ అయి… ఈ అంశాలపై చర్చించనున్నారు. వీటిపై చంద్రబాబు స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరడం.. ఆ తర్వాత పార్టీని కాషాయంలో విలీనం చేయడం.. భద్రతను కుదించడం చంద్రబాబుకు షాక్ మీద షాక్ అని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.