అమరావతి: రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే సీఎం జగన్ ని కలిశానని చెప్పారు. సోమవారం సీఎం జగన్ ని కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిస్థితిని సీఎంకు వివరించానని, అభివృద్ధి నిమిత్తం వెంటనే రూ.25 కోట్లు విడుదల చేయాలని జగన్ ఆదేశించారని తెలిపారు. సీఎం జగన్ కార్యదక్షత ఉన్న నాయకుడని, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఇంగ్లీషు మీడియం అమలుపై చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరితో ఉన్నారని అన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ కార్యదీక్షత, పట్టుదల చూసి చాలా సంతోషం వేసిందన్నారు. ఉగాది నాటికి పేదలు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారని ప్రశంసించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో రాష్ట్రం ఇండస్ట్రియల్ హబ్ అయిందని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో మళ్లీ అదే విప్లవం రాబోతోందన్నారు. బొల్లాపల్లి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. రాజధాని గురించి మాట్లాడే పెద్దవాడిని కాదని, రాజధానిపై సీఎంకి స్పష్టత ఉందన్నారు.
గత ఐదేళ్లలో అమరావతిలో అభివృద్ధి జరగలేదని, రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని, అప్పటివరకు వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఐదేళ్లలో రైతుల్ని ఇబ్బంది పెట్టింది ఎవరో అందరికి తెలుసునని అన్నారు. పార్టీ మారడం గురించి ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.తాను చంద్రబాబును విమర్శించడం లేదని ఆత్మపరిశీలన చేసుకోవాలని మాత్రమే చెబుతున్నానని ఎమ్మెల్యే గిరిధర్ అన్నారు.