అమరావతి: తెలుగుదేశంపై ప్రజలకు విశ్వాసం పోయిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. గత నెలలో టిడిపికి రాజీనామా చేసిన వంశీ మొదటి సారిగా గురువారం మీడియా ముందు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు అనుసరిస్తున్న విధానాన్ని వంశీ తప్పుబట్టారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఆందోళనలు, దీక్షలు చేయడం సరికాదని అన్నారు. వైసిపి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నానని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా సమర్థిస్తున్నానన్నారు. వైసిపికి మద్దతు ఇవ్వడానికి తన శాససనసభ సభ్యత్వమే అడ్డు అయితే రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనం కోసం నిలబడతాననీ, జగన్తో కలిసి నడుస్తానని వంశీ తెలిపారు. ఆర్థిక లావాదేవీలకు,కేసులకు భయపడి జగన్కు మద్దతు పలకడం లేదని అన్నారు. 1995 నుండి జగన్తో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నట్లు వంశీ వివరించారు.
‘ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నదుల్లో ఇసుకను మనం తీయగలమా? వర్షాలు, వరదలు ఉన్న సమయంలో ఇసుకను బయటకు తీసే సాంకేతిక టెక్నాలజీ మన దగ్గర ఉందా? చంద్రబాబు సెల్ ఫోన్, కంప్యూటర్.. కనిపెట్టారని తమ మిత్రులందరూ చెబుతుంటారు కనుక, ఇలాంటి టెక్నాలజీని కూడా కనిపెట్టే శక్తిని భగవంతుడు ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని వంశీ సెటైర్లు విసిరారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మంచిపని చేసినప్పుడు సమర్థించాలని, అదే మంచిపని కాకపోతే విమర్శించాలని సూచించారు.
ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ పద్ధతులు మార్చుకోకపోతే తెలంగాణలో పార్టీ పరిస్థితిగా ఇక్కడా తయారు అవుతుందని వంశీ వ్యాఖ్యానించారు. కొంత మంది బ్లాక్ మెయిల్ చేసి టిడిపిలో ఉండాలని చూస్తున్నారని పేర్కొన్నారు. 2009లో తన ప్రాణాలను ఫణంగా పెట్టి టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్… ఆ తరువాత టీడీపీకి ఎందుకు దూరమయ్యారని వల్లభనేని వంశీ చంద్రబాబును ప్రశ్నించారు. పదేళ్ల పాటు టీడీపీకి ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారో అంతా ఆలోచించాలని వ్యాఖ్యానించారు. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా నల్లపూసగా మారిపోయారని వల్లభనేని వంశీ అనడం చర్చనీయాంశంగా మారింది.