అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా చేసిన ప్రకటన ఏపి రాజకీయాలలో చర్చనీయాంశమవుతోంది. తాను వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమేననీ, ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతాననీ వంశీ తాజాగా వెల్లడించారు.
అయితే ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తొలి శాసనసభ సమావేశంలోనే చంద్రబాబు మాదిరిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని తేల్చి చెప్పారు. ప్రజా ప్రతినిధులు ఎవరైనా వైసిపిలో చేరాలని భావిస్తే ఆ పదపులకు రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి తీసుకుంటామని జగన్ నాడు స్పష్టం చేశారు.
తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావించినప్పటికీ పదవిలో ఉండే ప్రజలకు సేవ చేయాలని సన్నిహితులు సూచించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు వంశీ తెలిపారు.
గత నెలలో వంశీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిల వెంట వెళ్లి సిఎం జగన్ను కలిసిన విషయం తెలిసిందే. వైసిపిలో చేరాలంటే రాజీనామా చేయాలా, వద్దా అనేదానిపై చర్చ జరగలేదనీ, సమయం వచ్చినప్పుడు దానిపై నిర్ణయం తీసుకుంటామనీ వంశీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో వంశీ పార్టీలో చేరికకు జగన్ తలుపులు తెరుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
రాజీనామా షరతును జగన్ ఎత్తివేసి గేట్లు తెరిస్తే టిడిపి ఖాళీ అవుతుందనీ, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు అవుతుందనీ పలువురు వైసిపి నాయకులు అప్పుడప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్నారు. ఇదే విషయంపై మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఇటీవల మాట్లాడారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వంశీ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫిరాయింపులపై వైసిపి స్టాండ్ మార్చుకున్నట్లే కదా అనే చర్చ రాజకీయ వర్గాల నుండి వినబడుతోంది.
గన్నవరం నుండి రెండవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ.. గత నెల చివరి వారంలో తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే.