టిడిపి రాజ్యసభ సభ్యుల తరువాత శాసనసభ్యుల వంతు వచ్చిందా ? ఈ అంశంపైనే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి.
బిజెపిలో చేరేందుకు కొందరు టిడిపి శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారన్నది ఈ వార్తల సారాంశం. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్నారనీ, ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారనీ వినబడుతోంది.
గంటా వెంట మరి కొంత మంది టిడిపి శాసనసభ్యులు ఉన్నారనీ, అందరూ కలిసి గంటా నాయకత్వంలో ఢిల్లీ వెళతారని కొన్ని సోషల్ మీడియా వార్తలు సూచిస్తున్నాయి.
ఆయన వెంట 12మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కొన్ని వార్తలు సూచిస్తుండగా, తొమ్మిది మందేనని మరి కొన్ని వార్తలు చెబుతున్నాయి.
ఈ వార్తలను ఖండించేందుకు గానీ, ధృవీకరించేందుకు గానీ టిడిపిలో ఎవరూ సిద్ధంగా లేరు. అయితే టిడిపి శాసనసభ్యులకు, నేతలకు బిజెపి నాయకుల నుండి ఫోన్లు వస్తున్న విషయాన్ని మాత్రం పలువురు దృవీకరిస్తున్నారు. రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో బిజెపికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ముగ్గురు నాయకులు టిడిపి నేతలకు వరుసగా ఫోన్లు చేస్తున్నారు. బిజెపిలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇస్తున్నారు.