అమరావతి: టిడిపి సభ్యులు బుధవారం శాసనసభలోనూ, బయట నిరసన వ్యక్తం చేశారు. టిడిపి శాసనసభాపక్ష ఉప నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద చంద్రబాబుతో సహా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొద్ది సేపు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు.
అనంతరం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసిపి సభ్యులు జోగి రమేష్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సమయంలో కోట్లాది రూపాయల దుర్వినియోగం జరిగిందనీ, గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన దుర్ఘటనలో 29మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. వీటిపై విచారణకు సభా సంఘాన్ని నియమించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. వివిఐపి ఘాట్ ఉన్నప్పటికీ సాధారణ భక్తులు పుష్కర స్నానాలు చేసే ఘాట్లో చంద్రబాబు పుష్కర స్నానం చేశారనీ, దాన్ని సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనును పిలిపించి షూటింగ్ తీయించారని రమేష్ విమర్శించారు. నాడు జరిగిన ఘటనపై, నిధుల ఖర్చుపైనా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జోగి రమేష్తో సహా పలువురు అధికార పక్ష సభ్యులు కోరారు.
దీనిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పునః విచారణ జరిపిస్తామని సమాధానం చెప్పారు. అనంతరం టిడిపి సభ్యుడు అనగాని సత్యప్రసాద్ లేవనెత్తిన ప్రశ్నపై మంత్రి సమాధానం చెప్పారు. దీనిపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అవకాశం ఇవ్వాలని టిడిపి సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో సిఎం జగన్ మాట్లాడుతూ ప్రతి విషయంపై తమపై ప్రతిపక్షం విమర్శలు చేయడం, సభా సమయాన్ని వృధా చేయడం సరికాదని మండిపడ్డారు.
చంద్రబాబుకు మైక్ ఇవ్వాలని టిడిపి సభ్యులు నినాదాలు చేశారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. ఆ తరువాత కొద్ది సేపటిక సభ వాయిదా పడింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.