(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకోంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందులలోని ఆయన స్వగృహంలో దారుణ హత్యకుగురైయ్యారు. మొదట గుండెపోటుతో మరణించారని అనుకున్నప్పటికీ తరువాత ఆయన శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండటంతో హత్య అని తేల్చారు. దీంతో రాజకీయంగానూ ఆయన హత్య పెద్ద దుమారాన్నే రేపింది. ఈ కేసును అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఈ కేసును కొత్త సిట్ బృందానికి అప్పగించారు.
జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఆయన బాబాయి హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారంటూ ప్రతిపక్షాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా వందలాది మందిని విచారించిన సిట్ అధికారులు ఇటీవల వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు వైసిపి, టిడిపి, బిజెపి నేతలనూ విచారించారు.
సిట్ అధికారుల విచారణను ఎదుర్కొన్న టిడిపి నేత బిటెక్ రవి ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమయ్యింది. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సిబిఐకి అప్పగించాలని ఆయన కోరుతున్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నేతలు సిబిఐ దర్యాప్తును వ్యతిరేకించగా, వైసిపి నేతలు సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేశారు.ఈ కేసులో ఘటనా స్థలంలో సాక్షాధారాలు మాయం చేశారన్న అభియోగంపై వివేకా పిఎ, డ్రైవర్, వంట మనిషిని అరెస్టు చేయగా అనంతరం వీరు బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.