అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి వచ్చారు. విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులు, రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి కలుగుతున్న లాభం తదితర విషయాలపై ప్రధాని మోదితో చర్చించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నవరత్న పథకాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ రైతు భరోసా ప్రారంభోత్సవానికి ఈ నెల 15న రాష్ట్రానికి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ప్రధాని మోదితో భేటీ అనంతరం జగన్ చర్చించిన విషయాలపై అక్కడ మీడియాతో ఏమీ మాట్లాడకుండా వచ్చేశారు. ప్రధానితో మాట్లాడిన విషయాలపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పత్రికా ప్రకటన మాత్రం విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతుభరోసా కార్యక్రమానికి హజరవుతానని ప్రధాని మోది నుండి స్పష్టమైన హామీ రాకపోవడం వల్లనే పత్రికా సమావేశం పెట్టి విషయాలను వెల్లడించకుండా జగన్ మోహం చాటేశారని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రధానితో భేటీలో సిఎం జగన్ ఏమి చర్చించారో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉందనీ, ప్రధానితో చర్చల వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని యనమల అన్నారు. అమెరికాలో ప్రతిపక్షాల డిమాండ్తో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్ సంభాషణలను బైట పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా యనమల గుర్తు చేశారు.
కాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న 6000 రూపాయలకు మరో 6500 రూపాయలు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కలిపి వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో చెల్లిస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు కలిపి ఇస్తూ వారి స్టిక్కర్ వేసుకోవడం ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. ప్రధాన మంత్రి రైతు భరోసా పథకంగా పేరు పెట్టాలని కూడా కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఇప్పటికై బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ద్వారా ప్రధాని మోదితో ఈ విషయాలను తెలియజేశారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోది జగన్మోహనరెడ్డి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారా లేదా అనేది తెలుసుకోవాలంటే 15వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.