అమరావతి: అమరావతి రాజధాని కోసం తాము చట్టపరంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాడతామని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను మంత్రులు హేళన చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఎర్రబాలెంలో రైతుల దీక్షకు చంద్రబాబు, భువనేశ్వరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఎంపీ నాని మాట్లాడుతూ రాజధాని కోసం 34ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారని గుర్తు చేశారు. త్యాగమూర్తులు ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్లు అయ్యారా? అని మండిపడ్డారు. ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో రైతులు తరతరాలుగా వస్తున్న భూములను ఇవ్వడం దేశంలోనే రికార్డు చెప్పారు. నూతన సంవత్సరం రోజు రైతులను ఏడిపించడానికి జగన్ ముఠాకు సిగ్గుండాలని దుయ్యబట్టారు. నూతన సంవత్సరం రోజున అమరావతి రైతులను రోడ్డుపై నిలబెట్టాడని మండిపడ్డారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడం ఎవరి తరమూ కాదని చెప్పారు. రాజధాని తరలింపుపై న్యాయ పోరాటం చేస్తామని కేశినేని నాని స్పష్టం చేశారు. పరిపాలన చేత కాకపోతే ఒక్క ఛాన్స్ అని ఎందుకు అడిగావని ప్రశ్నించారు. విశాఖ ప్రజలు అమాయకులని..వారిని దోచుకుందామని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పులివెందుల ముఠాలను దింపి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులను కన్నీళ్లు పెట్టించిన వారెవ్వరూ బాగు పడలేదన్నారు.
విశాఖపట్నంలో ఖర్చు పెట్టే పది వేల కోట్లతో అమరావతినే అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. లక్ష కోట్లు పేరుచెప్పి విశాఖ మీద మోజుతో తరలించాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జగన్ తాత రాజారెడ్డి దిగి వచ్చినా రాజధానిని తరలించలేరని వ్యాఖ్యానించారు. రాజధాని తరలించబోము అని చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. పాలన చేతకాక పోతే.. రాజీనామా చేసి… ఎన్నికలకు రావాలని ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు.