అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) ఝలక్ ఇచ్చారు.
లోక్సభలో పార్టీ విప్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే తాను ఆ పదవి స్వీకరించడానికి సిద్ధంగా లేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. అంత పెద్ద పదవికి తాను అర్హుడిని కానంటూ కేశినేని సెటైర్ వేశారు.
తెలుగుదేశం పార్టీ నుండి ముగ్గురు పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఎన్నికయిన విషయం తెలిసిందే. వీరిలో కె రామ్మోహన్ నాయుడు లోక్సభాపక్ష నేతగా ఎంపిక కాగా, గల్లా జయదేవ్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. దీంతో విప్ పదవిని చంద్రబాబు కేశినేనికి అప్పగించారు.
లోక్సభలో ఈ పదవి చేపట్టడానికి మరో ఎంపి లేనప్పటికీ పార్టీలో అనేక మంది సమర్ధులు ఉన్నారనీ, వారికి ఈ పదవి ఇస్తే బాగుంటుందని కేశినేని అభిప్రాయం వ్యక్తం చేయడం చూస్తుంటే ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారన్న భావన వ్యక్తం అవుతోందని పలువురు పేర్కొంటున్నారు.
కొద్ది రోజుల క్రితం బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కేశినేని నాని కలిసి శుభాకాంక్షలు తెలియజేసి వచ్చారు.
ఈ నేపథ్యంలో కేశినేని బిజెపికి దగ్గర అవుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.