అమరావతి: శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలకు నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. గురువారం శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన దౌర్జన్యం విషయంలో తదుపరి కార్యాచరణపై టీడీఎల్పీ భేటీలో చర్చించనున్నారు. అసెంబ్లీ కార్యక్రమాల్ని బహిష్కరించిన టీడీపీ… మండలిలో జరిగిన పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్న శాసన మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై చర్చ సందర్భంగా వైసీపీ మంత్రులు అడ్డుతగిలారనీ, సభా సంప్రదాయాల్ని పాటించకుండా తమ ఎమ్మెల్సీలపై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సభా కార్యక్రమాలకు హాజరు కాకూడదని నిర్ణయించారు. తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని టీడీపీ ఇప్పటికే గవర్నర్కు ఫిర్యాదు చేసింది.
ఏపీ శాసనమండలిలో బుధవారం(జనవరి 22) తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మండలిలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఛైర్మన్ పోడియాన్ని ఇరుపక్షాల సభ్యులు చుట్టుముట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ చైర్మన్ షరీఫ్ తన నిర్ణయం ప్రకటించిన వెంటనే శాసనమండలిలో చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటనలు చోటుచేసుకున్నాయి. చైర్మన్ నోటి నుంచి ప్రకటన వెలువడిన వెంటనే వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరుగెత్తుకుంటూ చైర్మన్ వద్దకు వెళ్లి ఆయన చదువుతున్న పేపర్లను ముక్కలు ముక్కలుగా చించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చైర్మన్ సీటు వద్దకు వెళ్లి రెండు చేతులతో ఆయన కదలకుండా కట్టడి చేశారు. మంత్రులు అవంతి శ్రీనివాస్, కొడాలి నాని టేబుల్ పైకి ఎక్కి చైర్మన్ ముందు ఉన్న బల్లను చేతులతో చరుస్తూ ఆగ్రహం ప్రదర్శించారు.
మరోవైపు ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. దీనిపై టీడీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేయగా.. వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మందడం రహదారిపైకి జాతీయ జెండాలతో వచ్చి ‘సేవ్ అమరావతి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.