(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు టిడిపి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రూల్ 71ను తొలి సారిగా టిడిపి ఉపయోగించింది. ఈ మేరకు టిడిపి నోటీసు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించేందుకు రూల్ 71 కింద అధికారం ఉంది. అయితే రూల్ 71 కింద తీర్మానం ప్రవేశపెట్టాలంటే మెజార్టీ అవసరముంది.
తీర్మానానికి కనీసం 20 మంది మద్దతు ఉండాలి, రూల్ 71కు ఎంత మంది మద్దతు ఇస్తున్నారని మండల చైర్మన్ ప్రశ్నించగా 30 మంది ఎమ్మెల్సీలు టిడిపి తరుపున లేచి నిలబడ్డారు. తీర్మానంపై చర్చకు మండలి విపక్షనేత యనమల రామకృష్ణుడు పట్టుబట్టారు. అయితే రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొంటున్నారు.