(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ కావడం చర్చనీయాంశం అయింది. వీరిద్దరూ తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఉదయం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మధ్యాహ్నం కరణం సుజనాతో భేటీ కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం సుజనాతో ఉన్న పరిచయంతోనే సమావేశమయ్యానని కరణం బలరాం చెబుతున్నా…పార్టీ మారే అంశంపైనే చర్చించినట్లు సమాచారం. అయితే బీజేపీ సిద్ధాంతాలు నమ్మి వచ్చే వారి సమర్ధత, సామర్ధ్యం చూసి ఆహ్వానిస్తామని సుజనా చెబుతుండడం అనేక ఊహగానాలకి ఊతం ఇస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీతోపాటు చాలా మంది నేతలు బీజేపీ మీద సానుకూలంతో ఉన్నారని సుజనా చౌదరి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారితో పాటు ఇతర పార్టీల నేతలు కూడా తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసి రాజ్యాధికారం సాధిస్తామని పేర్కొన్నారు. ఆ బాధ్యతను పార్టీ అధిష్టానం తనకు అప్పగించిందని సుజనా చౌదరి చెప్పారు.
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం బలరాం, వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్ పై విజయం సాధించారు. అయితే, తాను ఎమ్మెల్యే అయినప్పటికీ.. అధికార పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ హవానే ఎక్కువగా నడుస్తుందనే అభిప్రాయం కరణం బలరాంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీలో చేరడం కంటే.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ ఎంపీ సుజనాతో టీడీపీ నేతల వరుస భేటీల కావడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.