అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగులకతప్పదనిపిస్తోంది. ఆ జిల్లాకి చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులుతో పాటు మరి కొందరు నేతలు టిడిపిని వీడి వైసిపిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హజరైన తూర్పు గోదావరి జిల్లా పార్టీ నేతల సమావేశానికి తోట త్రిమూర్తులతో పాటు ఆయన వర్గీయులు, టిడిపి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ తదితరులు గైరు హాజరు అయ్యారు. తోట త్రిమూర్తులు కోసం చంద్రబాబు ప్రత్యేకంగా కబురు పంపినా ఆయన సమావేశానికి హజరు కాలేదు. తోట త్రిమూర్తులు తన వర్గీయులతో కలిసి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆయన ఇప్పటికే వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సమావేశమయినట్లు తెలుస్తోంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వైసిపి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, తోట త్రిమూర్తులు స్వయానా వియ్యంకులు. టిడిపిలో నారా లోకేష్, యనమల రామకృష్ణుడు పెత్తనాన్ని తోట త్రిమూర్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో కాకినాడలో జరిగిన టిడిపి కాపు నేతల రహస్య సమావేశానికి తోట నాయకత్వం వహించారు. అప్పటి నుండి ఆయన పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయంతో ఆ పార్టీ కీలక నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతూ చంద్రబాబుకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిపోయారు. అనంతరం ఒక ఎమ్మెల్సీ, పలువురు మాజీ నేతలు బిజెపిలో చేరిపోగా, ఇప్పుడు అధికార వైసిపిలోకి వలసలు ప్రారంభం అవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం టిడిపి నుండి విశాఖ జిల్లాకు చెందిన నేత అడారి అనంద్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రమాకుమారితో సహా పలువురు విశాఖ డైరీ డైరెక్టర్లు వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా టిడిపికి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరనున్నారనే ప్రచారం జరుగుతున్నది. మరో వైపు ఎన్నికలకు ముందు వైసిపి నుండి టిడిపిలో చేరిన దివంగత నేత వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధ కూడా ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వంగవీటి రాధ టిడిపిని వీడి జనసేన పార్టీలోకి చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. నిన్న ధిండి రిసార్ట్స్లో జరిగిన జనసేన సమావేశ సమావేశ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో వంగవీటి రాధ భేటీ అయ్యారు.
ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో టిడిపిలోని పలువురు నేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాస్ తదితర నాయకులు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలంలోనే వివిధ కారణాలతో డజను మందికిపైగా సీనియర్ టిడిపి నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సి ఉంటుంది.