రెండు తెలుగు రాష్ట్రల మధ్యా ఘర్షణకు దారి తీస్తున్న డేటా చోరీ వివాదంలో కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ బుధవారం మీడియా సమావేశంలో చాలా విషయాలు చెప్పారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి 23న వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి హైదరాబాద్ పోలీసులకు సేవామిత్ర యాప్ను నిర్వహిస్తున్న ఐటి గ్రిడ్స్పై ఫిర్యాదు చేశారు. అంతకు ముందే అమరావతి కేంద్రంగానే ఈ కుట్ర పన్నారని కేశవ్ అంటున్నారు. విజయసాయి రెడ్డి ఫిర్యాదు విషయం టైమ్స్ ఆప్ ఇండియా దినపత్రికలో కూడా వచ్చింది.
ఆ వెంటనే పోలీసులు ఐటి గ్రిడ్స్ సంస్థ కార్యాలయంపై మఫ్టీలో దాడి చేశారు. సంస్థ డైరక్టర్ అశోక్ సహా అక్కడి ఉద్యోగులను విచారించారు. కంప్యూటర్ల నుంచి కొంత డేటాను బలవంతంగా తీసుకువెళ్లారు. ఇదంతా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే జరిగింది.
తర్వాత తుమ్మల లోకేశ్వర రెడ్డి రంగంలోకి వచ్చారు. ఆయన మార్చి రెండవ తేదీన ఫిర్యాదు చేశారు. దానిపై వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు ఐటి గ్రిడ్స్ సిబ్బంది కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ పడేసరికి వారిని వదిలిపెట్టారు.
విజయ సాయి రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు ఐటి గ్రిడ్స్పై దాడికి దిగి డేటా ఎత్తుకెళ్లగానే టిడిపి ఎందుకు స్పందించలేదన్నది ఊహాతీతంగా ఉంది. ఫిర్యాదు చేసింది విజయసాయి రెడ్డి. ఆయన వైసిపిలో ఎంత ముఖ్య నాయకుడో అందరికీ తెలుసు.
పోలీసులు సోదాలు జరిపింది ఐటి గ్రిడ్స్ సంస్థలో. ఆ సంస్థ టిడిపికి ఐటి సేవలు అందిస్తున్నది. టిడిపికి ప్రాణం వంటి సేవామిత్ర యాప్ను నిర్వహిస్తున్నది. అలాంటి సంస్థలో హైదరాబాద్ పోలీసులు సోదాలు జరపడమే కాకుండా కొంత డేటా తీసుకున్నారని ఇప్పుడు టిడిపి నేతలు అంటున్నారు. దానికి సాక్ష్యంగా సిసి టివి చిత్రాలు చూపిస్తున్నారు. మరి ఆరోజే వారికి అనుమానం రావాలి కదా? ఎందుకు మా సమాచారం తీసుకున్నారని హైదరాబాద్ పోలీసులను ప్రశ్నించాలి కదా? వైసిపి, టిఆర్ఎస్, బిజెపి కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని ప్రతిరోజూ విమర్శించే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు కానీ, ఆ పార్టీ ఇతర నాయకులకు కానీ హైదరాబాద్ పోలీసుల సోదాల లోగుట్టు అర్దం కాకపోవడం ఏమిటి? లోకేశ్వర రెడ్డి ఫిర్యాదుపై మళ్లీ పోలీసులు కదిలే వరకూ ఇన్ని రోజూలూ టిడిపి మౌనంగా ఉండడం ఆశ్చర్యంగా లేదూ!