అమరావతి: ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవంబర్ మూడవ తేదీన విశాఖలో తలపెట్టిన నిరసన ర్యాలీ(లాంగ్ మార్చ్)కి టీడీపీ మద్దతు ఉంటుందని ఆపార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ తరఫున సీనియర్ నేతలు ర్యాలీలో పాల్గొంటారని వెల్లడించారు. ఇసుక కొరత సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరత కారణంగా జరిగిన ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తామని అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని నిలదీశారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోవడం వల్లే ఏపీలో కొరత ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు. వరదల కారణంగా ఇసుక తవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోందని, అయితే, తెలంగాణలో వర్షాలు పడుతున్నా ఇసుక కొరతలేదని చెప్పారు. తక్షణమే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని, బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు టీడీపీ తరఫున లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్తో నవంబరు 3వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కల్యాన్ విశాఖలో ‘లాంగ్ మార్చ్’ చేపట్టనున్నారు. దీనికి మద్దతివ్వాలని జనసేనాని పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని ప్రతిపక్షాలను కోరారు. బుధవారం తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో, తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలతో ఫోన్లో మాట్లాడారు. లాంగ్ మార్చ్కు తెలుగుదేశం సంఘీభావం ప్రకటించాలని ఆయన కోరగా, చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తాజాగా పవన్ ర్యాలీకి మద్దతు ప్రకటించారు. అయితే, బీజేపీ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. పవన్ తో కలిసి వేదిక పంచుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు వాదించారు. బీజేపీ ఆధ్వర్యంలో నవంబర్ 4న ఇసుక సత్యాగ్రహం చేస్తామని ప్రకటించారు.
లక్షలాదిమంది కార్మికులను రోడ్డుపాలు చేసిన ఇసుక సమస్యపై బీజేపీ మొదటినుండి రాజీలేని పోరాటంచేస్తూ గవర్నర్,సీఎం దృష్టికి తెచ్చి భిక్షాటనతో ప్రజాపక్షాన నిలిచాం.
నవంబర్ 4న బీజేపీ ఆధ్వర్యంలో
"ఇసుక సత్యాగ్రహం" చేపడుతున్నాం.ఇసుక సమస్య పై పోరాడే ఎవరికైనా బీజేపీ సంఘీభావం తెలుపుతుంది. pic.twitter.com/4FKxgYasHm
— Kanna Lakshmi Narayana (@klnbjp) October 30, 2019