అమరావతి: కృష్ణానదికి వరద పూర్తిగా తగ్గిపోయినా రాష్ట్రంలో అధికార, విపక్షాల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణ వరద కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన తరుణంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.వరద ముంపు నివారణ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందనీ, టిడిపి అధినేత చంద్రబాబు ఇల్లు ఎప్పుడు మునుగుతుందా అంటూ వైసిపి నేతలు ప్రదక్షిణలు చేశారని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు.తాము సమర్థవంతంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశామనీ, కావాలనే టిడిపి వరదను రాజకీయం చేస్తుందంటూ అధికార పార్టీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.
తాజాగా మంగళవారం టిడిపి మాజీ మంత్రి జవహర్ ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వరద ముంపు నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ముంపు నివారణ చేతగాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లగా ఇక్కడ మంత్రులు చంద్రబాబు ఇల్లు ఎప్పుడు మునుగుతుందా అంటూ ప్రదక్షిణలు చేశారనీ జవహర్ అన్నారు. రాజకీయ కక్షసాధింపుపై ఉన్న శ్రద్ద వరద బాధితులను ఆదుకోవడంలో లేదని జవహర్ దుయ్యబట్టారు. జులై 25 తరువాత ఏపికి వరదలు వస్తాయని కర్నాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించినా జగన్ ప్రభుత్వం దృష్టి సారించలేదని జవహర్ పేర్కొన్నారు.కుట్రపూరితంగా కావాలని నీటిని నిల్వ చేసి అధికార పార్టీ నేతలు విపత్తును సృష్టించారని జవహర్ అరోపించారు. ఇప్పటికైనా టిడిపిపై కక్షసాధింపు చర్యలు ఆపి ముంపు బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలని జవహర్ డిమాండ్ చేశారు.
కాగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిడిపి నేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సంక్షోభం ద్వారా వచ్చిన అవకాశాలను దోపిడీకి వినియోగించుకునేది చంద్రబాబు విధానమని బొత్సా ఆరోపించారు. తమ పార్టీకి అలాంటి విధానాలు అక్కరలేదని బొత్సా అన్నారు. వరదలు వచ్చినా ఆస్తి, ప్రాణనష్టం లేకుండా సమర్థవంతంగా చర్యలు తీసుకున్నామని బొత్సా వివరించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి వరద బాధితులను ఆదుకున్నామని బొత్సా చెప్పారు. ముంపు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించేందుకు సిద్ధమవుతున్నామని బొత్సా తెలిపారు. వరద బాధితుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేవని బొత్సా పేర్కొన్నారు.
వరద తగ్గినందున పంట నష్టం అంచనాలు సిద్ధం చేయమని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామని బొత్సా చెప్పారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా అధికారులు, మంత్రులు కృష్ణ కరకట్ట, ముంపు గ్రామాలను పర్యవేక్షించారనీ, ఎక్కడ గండ్లు పడతాయో తెలుసుకొని జాగ్రత్తలు తీసుకున్నారని బొత్సా వివరించారు. చంద్రబాబు, ఆ పార్టీ నేతలు వరద బాధితులను అడిగితే ప్రభుత్వం తరపున తాము ఏమి చేశామో చెబుతారని బొత్సా అన్నారు. ఇష్టం వచ్చినట్లుగా చిల్లర మాటలు మాట్లాడి రాజకీయ నేతలంటే చులకన పరిస్థితులు తీసుకురావద్దని బొత్సా హితవు పలికారు. వరదలు వచ్చినప్పుడు డ్రోన్లతో అంచనాలు చేయాలనీ, టెక్నాలజీని వాడుకోవాలని గతంలో చంద్రబాబే చెప్పారనీ, నేడు తాము అదే విధానాన్ని అవలంబిస్తే వక్రభాష్యం ఎందుకు తీస్తున్నారని బొత్సా ప్రశ్నించారు. ఫ్లడ్ మేనేజ్మెంట్లో తాము వైఫల్యం చెంది ఉన్నట్లైయితే వరదలో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయేవని బొత్సా అన్నారు. వైసిపి ప్రభుత్వ సమర్థవంతంగా వరద నివారణ చర్యలు తీసుకుందనీ, ఇప్పటికైనా టిడిపి నేతలు అర్థంపర్థం లేని విమర్శలు మానుకోవాలని బొత్సా హితవు పలికారు.