(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం బ్రేక్ వేస్తుందా? ఈ ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం విషయంలో కేంద్రం ఏం చేయబోతోంది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే… ఈ అంశంలో తెలంగాణ బీజేపీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీతో కలిసి ఉమ్మడి ప్రాజెక్ట్ ఎలా కడతారని తెలంగాణ బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇద్దరు సీఎంలు నీళ్ల పేరుతో దోపిడీకి ఎత్తుగడ వేశారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడానికే జగన్-కేసీఆర్ లక్ష కోట్లతో ప్రాజెక్టులు కడతామంటున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల అంశాన్ని కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ నీళ్లను ఏపీ దోచుకుందని దూషించి పబ్బం గడుపుకొన్నారన్నారు. ఇప్పుడు ఏపీతో కలిసి ప్రాజెక్టులు ఎలా కడతారని లక్ష్మణ్ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడం, కమీషన్ల కోసం ఏపీ సీఎంతో కలిసి కేసీఆర్ ప్రాజెక్ట్ల నాటకం ఆడుతున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు దండుకుని కేసీఆర్ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారని చెప్పారు. రూ.30 వేల కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు రూ.80 వేల కోట్లకు చేరుకుంద లక్ష్మణ్ విమర్శించారు. తాజాగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం పేరుతో దోపిడీకి ప్లాన్ చేశారని ఆరోపించారు.
తెలంగాణ బీజేపీ ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసీఆర్, జగన్ ల నదుల అనుసంధానం ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుంది? అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో విడివిడిగా భేటీ కానున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రధాని మోదీతో సమావేశం అవుతారు. ఇక ఏపీ సీఎం జగన్ ఈ నెల 5న ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఇద్దరు సీఎంలు ప్రధానంగా కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాలపై ప్రధాని వద్ద ప్రస్తావించనున్నారని సమాచారం. ఉభయ రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలకు నీటిని తరలించాలన్నది ప్రతిపాదనన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు. సాగునీరు, తాగు నీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చే ఈ ప్రాజెక్టుకు సహాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు.
గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు తరలించే విషయంతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు ఇతర అంశాల పై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల ప్రగతి భవన్లో సుదీర్ఘ చర్చ జరిపారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండి ఎలా తరలించాలి, అలైన్మెంట్ ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చించారు. ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా జలాల తరలింపు, నీటి వినియోగం ఉండాలని..దీనికోసం రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.