తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేస్తున్నది. ఇప్పుడు కరోనా కట్టడి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందంటూ బిజెపి విమర్శలు గుప్పిస్తోంది. ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులు అయిన తరువాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నుంచి అంతా టీఆర్ఎస్ ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేశారు.
ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కుదేలు అయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో రెండవ స్థానాన్ని ఆక్రమించుకొని రాబోయే ఎన్నికల నాటికీ పాగా వేయాలన్న సంకల్పంతో బీజేపీ అవసరమైన అన్ని శక్తులను ఒడ్డుతున్నది.
తెలంగాణ సర్కార్ కరోనా టెస్ట్ లను నామమాత్రంగా చేపట్టడాన్ని ఇప్పటికే హైకోర్టు నుంచి అంతా తప్పు పట్టిన విషయం తెలిసిందే. కరోనా పరీక్షల సంఖ్య తక్కువగా ఉన్నా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం, ముఖ్యంగా హైదరాబాద్ లోనే వైరస్ వృద్ధి అధికంగా ఉండటం ఆందోళన కల్గిస్తోంది. దీనికి తోడు పలు ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా పేషెంట్స్ ను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనితో బిజెపి ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. రోజుకు 11 వేల మందికి పరీక్షలు చేయవలసి ఉండగా మూడు వేల మందికి మాత్రమే చేస్తూ కేంద్రానికి టీ ఆర్ ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తుందని బీజేపీ నేత రామ్ మాధవ్ ఆరోపించారు. కరోనాలో తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నవి అన్ని తప్పుడు లెక్కలు, ఇచ్చేది అంతా తప్పుడు సమాచారం అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అందుకే హైదరాబాద్ అభద్రతకు కేరాఫ్ గా మారిందని రామ్ మాధవ్ విమర్శించారు. ఇంతకు ముందు బిజెపి ఎమ్యెల్యే రాజా సింగ్ కూడా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజు పేద తేడా లేకుండా అంతా ప్రభుత్వ ఆసుపత్రిలోనే జబ్బు వస్తే చికిత్స అన్న ప్రభుత్వం ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో మంత్రులకు, ఎమ్యెల్యేలకు, బడా బాబులకు చికిత్స ఎందుకు చేయిస్తుందని అయన నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై వారికెందుకు నమ్మకం లేదన్నది ఆయన ప్రశ్నించారు.
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం కరోనా కట్టడి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఇదిలా ఉంచితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ లో నిత్యం ఆందోళన చేస్తూ హడావుడి చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల సమస్య నుంచి అనేక అంశాలపై ఆయన ఆందోళనలు చేస్తూ కెసిఆర్ సర్కార్ ను ఎండగడుతున్నారు. అయితే బిజెపి నేతల ఆరోపణలకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్ తదితరులు ధీటుగానే సమాధానం చెబుతున్నారు. బిజెపి నేతల హంగామా అలా ఉండగా కాంగ్రెస్ హడావిడి అంతంత మాత్రంగానే ఉన్నది. ప్రభుత్వంపై బిజెపి నేతలు విమర్శలు చేస్తున్న తరుణంలో ఏకంగా గవర్నర్ తమిళిసై రంగంలోకి దిగి కరోనా అంశంపై సమీక్ష జరపడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
రాష్ట్రంలో బీజేపీ నేతల పోరాటాలకు అధిష్టానం ఆశీస్సులు కూడా ఉండటంతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారతాయని అనుకుంటున్నారు.