హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు సీఎం కేసీఆర్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల పూర్తి ఎజెండాతోపాటు పనిదినాలను బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 9న తొలిరోజున శాసనసభలో సీఎం కేసీఆర్ బడ్జెట్పై ప్రసంగం చేయనున్నారు.
రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కసరత్తు చేశారు. దేశావ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ నేపధ్యంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదాయం తగ్గిందని, ఆర్ధిక మాంద్యానికి పలు రంగాలపై ప్రభావం పడిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఆదాయాలు బాగా తగ్గిపోయాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయాలతో పాటు అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. రానున్న బడ్జెట్ పూర్తిగా వాస్తవ రూపంలో ఉండాలని చెప్పిన సీఎం.. వ్యవసాయం, ప్రజాసంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
మరోవైపు ఈ దఫా బడ్జెట్ సమావేశాలు వాడిగా, వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్తు కొనుగోళ్ళ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై తారస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.