(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా శనివారం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీలో సమూల మార్పులే లక్ష్యంగా మంత్రి మండలి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మె సహా మరో 30 అంశాల ఎజెండాపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీపై ఇంతకుముందు ప్రకటించిన నిర్ణయానికే సీఎం కట్టుబడి ఉంటారా? లేక నిర్ణయాన్ని మార్చుకుంటారా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సుమారు నెల రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోబోతోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ఉన్న అవకాశాలపై ఈ భేటీలో ప్రభుత్వం పరిశీలన జరపనుంది. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రైవేటు ఆపరేటర్ల విషయంలోనా, కార్మిక సంఘాలతో చర్చల విషయంలోనా అన్నది తేలాల్సి ఉంది. ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీలోకి ప్రైవేట్ బస్సులు, రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గం చర్చించనుంది.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆర్టీసీలో 50 శాతం యాజమాన్యం బస్సులు, 30 శాతం అద్దె బస్సులు నడుపుతూ.. మిగతా 20 శాతం ప్రైవేట్ బస్సులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి కోసం ప్రత్యేకంగా స్టేజ్ కేరియర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 26 శాతం అద్దె బస్సులు ఉన్నాయి. అదనంగా 4 శాతం అద్దె బస్సుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అద్దె బస్సుల 30 శాతం కోటా పూర్తవుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని అద్దె బస్సులను అనుమతించేందుకు.. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ తరఫున పది వేలకు పైగా బస్సులు నడుస్తుండగా అందులో అద్దె బస్సులు రెండు వేలపై చిలుకు ఉన్నాయి. అయితే, ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్రైవేటు బస్సులను రోడ్డు ఎక్కించేందుకు చర్యలు చేపడుతోంది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ప్రైవేట్ స్టేజ్ కేరియర్లకు అనుమతులు ఇవ్వవచ్చని సీఎం కేసీఆర్ ఇప్పటికే తెలిపారు. అందుకు అనుగుణంగా అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఐదు వేల రూట్లలో ప్రైవేట్ స్టేజ్ కేరియర్లకు అనుమతులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు హైదరాబాద్ మెట్రో రైలుకు సర్వీసుల అనుసంధానం, సెట్విన్ సర్వీసు సేవలను మరింత మెరుగ్గా వినియోగించుకోవడం లాంటి ప్రతిపాదనలను ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటన్నింటిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.