తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుటుంబ సమేతంగా తమిళనాడు కంచిలోని శ్రీఅత్తి వరదరాజస్వామి వారిని దర్శించుకునేందుకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరారు. కెసిఆర్ బేగంపేట నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుండి రోడ్డు మార్గంలో కంచికి బయలుదేరి వెళుతున్నారు. కెసిఆర్కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిథున్రెడ్డి, వైసిపి నేతలు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద భద్రతాపరమైన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో కెసిఆర్కు స్వాగతం పలికేందుకు ముఖ్య నాయకులను మాత్రమే అధికారులు అనుమతించారు. పెద్ద సంఖ్యలో వైసిపి శ్రేణులు విమానాశ్రయం బయటే ఉండిపోయారు. కెసిఆర్ కంచి నుండి తిరుగు ప్రయాణంలో నగిరి ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్మన్ ఆర్కె రోజా నివాసంలో కొద్దిసేపు ఆగి తేనీటి విందు స్వీకరించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో రేణిగుంట నుండి హైదరాబాదుకు వెళ్లనున్నారు.
previous post
next post