(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల గడువు తరుముకొస్తోంది. పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు టీడీపీ ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని టీడీపీ నాయకుడు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ధ్రువీకరించారు. శనివారం కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే మెచ్చ కలవడం చర్చనీయాంశమైంది. తొలుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని కలిశారు. పురపాలక ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ కలిసి పనిచేయాల్సిన అవశ్యకతను మెచ్చా వివరించినట్లు సమాచారం. టీడీపీ బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొత్తు అంశాలు చర్చించారు. అవసరమైతే సీపీఎం, సీపీఐలనూ కలుపుకొని వెళ్లాలని రేవంత్ కు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లో ఇరుపార్టీల నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది
మరోవైపు ప్రధాన పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తుంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చతికిలపడిన పార్టీల్లో మాత్రం ఇప్పటికీ ఉలుకూపలుకూ లేదు. అసలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్ద అన్న ఊగిసలాట ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి, వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు ఎన్నికల్లో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. పోటీ చేయాలా.. లేదా ఎన్నికలకు దూరంగా ఉండి పరువు కాపాడుకుందామా అన్న ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందన్న భావనలో కాంగ్రెస్ ఉంది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒంటరిపోరుకే మొగ్గుచూపుతోంది. పార్టీ నిర్ణయాన్ని క్యాడర్కు ఇప్పటికే చేరవేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయా? లేదా ? అన్నది చూడాలి.