హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు నేడు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. విలీనంకు స్పీకర్ ఆమోదించారు. టిఅర్ఎస్ లో సిఎల్ పి విలీనం ప్రక్రియ పూర్తి అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి నర్శింహచార్యులు బులిటెన్ విడుదల చేశారు.
సిఎల్పిని టిఆర్ఎస్లో విలీనం చేసే ప్రక్రియను నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగగా పోలీసులు అరెస్టు చేశారు.
తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నేడు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో పార్టీలో చేరడంతో విలీన ప్రక్రియకు అవసరమైన మెజార్టీ సమకూరింది. కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో చేరిన 11మందితో పాటు రోహిత్ రెడ్డితో కలిసి మొత్తం 12మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్ పోచారంకు అందజేశారు. అనంతరం వీరు ప్రగతి భవన్కు చేరుకున్నారు.
గతంలో టిడిపి శాసనసభాపక్షం, కాంగ్రెస్ శాసనమండలి పక్షం ఇలాగే టిఆర్ఎస్లో విలీనమయ్యాయి. ఇదే వ్యూహంతో కాంగ్రెస్ ఫిరాయింపు వర్గం ముందుకువెళుతోంది.
విలీన ప్రక్రియను నిరసిస్తూ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్బాబు, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ ఆలీ, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు.
సిఎల్పిని టిఆర్ఎస్లో విలీనం చేయాలని కోరుతున్న ఎమ్మెల్యేలందరిపైనా అనర్హత వేటు వేయాలని నేతలు డిమాండ్ చేశారు. స్పీకర్ తీరుపై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా విలీనంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వారు ప్రకటించారు. కాగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను పోలీసులు అరెస్టు చేసి టప్పాచిపుత్ర పోలీస్ స్టేషన్కు తరలించారు.
విలీనం ప్రక్రియ పూర్తి అవ్వడంతో శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఆరుకు పడిపోయింది.