హైదరాబాద్: మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులపై అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు, ఆయన అనుచరులు దాడి చేయడంతో అసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కొత్త సారసాల గ్రామం రణరంగంగా మారింది. టిఆర్ఎస్ నేతల దాడిలో అటవీశాఖ ఆర్ఒ అనితకు తీవ్రగాయాలు అయ్యాయి. కొత్తసారసాల శివారులోని 20 హెక్టార్ల భూమి విషయంలో గత కొంత కాలంగా స్థానిక రైతులు, అటవీశాఖ అధికారుల మద్య వివాదం కొనసాగుతోంది. తాము చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ భూములను ఖాళీ చేయాల్సిందేనని అటవీశాఖ స్పష్టం చేస్తూ వచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ముంపుకు గురైన భూములకు బదులుగా కొత్త సారసాలలోని పోడు భూముల్లో మొక్కలు నాటాలని అటవీశాఖ నిర్ణయించింది.
నేడు ఫారెస్టు అధికారిణి అనిత నేతృత్వంలో సిబ్బంది మొక్కలు నాటేందుకు వెళ్లగా జడ్పి వైస్ చైర్మన్, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు నేతృత్వంలో ఆయన అనుచరులు, పలువురు రైతులు ఫారెస్టు సిబ్బందిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జడ్పి వైస్ చైర్మన్ కృష్ణారావే స్వయంగా కర్రతో ట్రాక్టర్పై దాడి చేయగా ఆయన అనుచరులు ఫారెస్టు ఆఫీసర్ అనితపై కర్రతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అనితను కాగజ్నగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కాగజ్నగర్ డిఎస్పి సాంబయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై జిల్లా ఫారెస్టు ఆఫీసర్ రాజారమణరెడ్డి ప్రభుత్వానికి సమాచారం అందించారు. గాయపడిన అధికారిణి అనిత ఫిర్యాదు మేరకు జడ్పి వైస్ చైర్మన్ కృష్ణారావు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జడ్పి వైస్ చైర్మన్ పదవికి కృష్ణారావు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేసినట్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు.
వీడియో ఎఎన్ఐ సౌజన్యంతో…
#WATCH Telangana: A police team & forest guards were attacked allegedly by Telangana Rashtra Samithi workers in Sirpur Kagaznagar block of Komaram Bheem Asifabad district, during a tree plantation drive. (29-06) pic.twitter.com/FPlME1ygCp
— ANI (@ANI) June 30, 2019