(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్టీసీ ప్రైవేటీకరణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగినట్లేనా ? ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ స్పీడప్ చేయనున్నారా ? తాజాగా హైకోర్టు వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆర్టీసీ ప్రైవేటీకరణకు బ్రేకులు పడే అవకాశం లేదని తెలుస్తోంది. ‘రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతుందా ? ఆర్టీసీ, ప్రైవేట్ వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయం తప్పేలా అవుతుందో చెప్పండి’అంటూ హైకోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇక ప్రైవేటీకరణ అంశాన్ని పట్టా లెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఆర్టీసీ భవితవ్యమే ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్ మరోసారి అధికారులతో సమావేశంలో కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను అమలులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. ముందుగా నిర్ణయించిన విధంగా కొత్త ఆర్టీసీ పాలసీ విధానంపై చర్చించనున్నారని తెలుస్తోంది. 50 శాతం ఆర్టీసీ బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, 20శాతం ప్రైవేట్ బస్సులు నడపాలనేది సర్కార్ ఆలోచన, దీనిపై విధివిధానాలు కూడా ఖరారయ్యాయి. ఇప్పటికే అద్దెబస్సుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.
గత 46 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను సీఎం పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు. కార్మిక సంఘాలు ఎంత పోరాటం చేసినా, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా సీఎం కేసీఆర్ వెనకడుగు వేసే అవకాశం కనిపించడం లేదు. వారితో తాడోపేడో తేల్చుకోవటానికే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. హైకోర్ట్ అభ్యంతరాలు చెప్తే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి లైన్ క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెను కేవలం ఒక రాజకీయ సమ్మెగానే సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వాదిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీనే ఇందులోకి లాగాలనే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నూతన రవాణా సవరణ చట్టం 2019లో భాగంగానే తాము నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ చెబుతున్నారు. ఆ చట్టం ప్రకారం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రవాణా వ్యవస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకునే అధికారం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టాన్నే తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయంలో కోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పు బట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ స్పీడప్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కేబినెట్ నిర్ణయంలో 5,100 రూట్ పర్మిట్లను ప్రైవేటుకు ఇవ్వడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది.