(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్టీసీ కేసును లేబర్ కోర్టుకు పంపాలా ? వద్దా ? అనే నిర్ణయం తీసుకునే అధికారం లేబర్ కమిషనర్ కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, ఆర్టీసీ అంశాన్ని లేబర్ కోర్టుకు పంపొద్దన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు పంపాలనే నిర్ణయానికి వస్తే దాన్ని జీవో రూపంలో ఇవ్వాలి. ఏ అంశాలపై కోర్టుకు వెళ్లాలో అందులో పేర్కొనాలి. ఈ జీవో ప్రకారం లేబర్ కమిషనర్ సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు రిఫర్ చేస్తారు. అటు కార్మికులు, ఇటు యాజమాన్యం వాదనలు విన్నాక కోర్టు తీర్పు ఇస్తుంది. ఇదంతా పూర్తవడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశముంది. దానివల్ల సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుందని, అటు ఆర్టీసీ రూట్లను ప్రైవేటుకు అప్పగించడం వంటి నిర్ణయాల అమలుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను లేబర్ కమిషనర్ కు బదలాయింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్టీసీ అంశాన్ని లేబర్ కోర్టుకు పంపాలా ? వద్దా ? అన్నదానిపై లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిఇలా ఉంటే.. హైదరాబాద్ లోని లేబర్ కమిషనర్ కార్యాలయానికి జంట నగరాల్లోని ఆర్టీసీ డిపోల కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవట్లేదని కార్మిక కమిషనర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డిపో మేనేజర్లు తమను విధుల్లోకి తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘సేవ్ ఆర్టీసీ’ అంటూ ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆర్టీసీ జేఏసీ మండిపడుతున్నారు.
కాగా, ఆర్టీసీ సమ్మెపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు చివరికి ఈ అంశాన్ని లేబర్ కోర్టే తేల్చాలని నవంబర్ 18న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సమ్మెపై లేబర్ కమిషనర్ రెండు వారాల్లోగా రిపోర్టు ఇవ్వాలని, దాని ఆధారంగా లేబర్కోర్టుకు పంపడంపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ పంపకపోతే ఎందుకు పంపలేదన్న కారణాలతో రిపోర్టు అందజేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పాలంటూ లేబర్ కమిషనర్ గతవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. కోర్టు చెప్పిన గడువులో ఇప్పటికే పది రోజులు పూర్తయింది. ఇంకా ఐదు రోజులే టైముంది. దీంతో సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు రెఫర్ చేస్తే తలెత్తే సమస్యలేమిటన్న దానిపై సర్కారు ఆరా తీసింది. లేబర్ కోర్టుకు పంపితే సమస్యకు ఇప్పట్లో పరిష్కారం రాదని, అందుకని ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలిపితే ఎలా ఉంటుందని సీఎం ఆలోచనలో ఉన్నట్టు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టం మేరకు.. సంస్థ, కార్మికుల మధ్య వివాదం తలెత్తినప్పుడు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ రాజీ ప్రయత్నాలు చేయాలి. అక్టోబర్ 4న జాయింట్ కమిషనర్ ఇరువురిని పిలిచి సంప్రదింపులు జరిపారు. అయితే ఆ ప్రక్రియ మధ్యలో ఉండగానే కార్మికులు సమ్మెలోకి వెళ్లారని, అందుకే జాయింట్ కమిషనర్ సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించారని ప్రభుత్వం చెబుతోంది.