హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై హైపవర్ కమిటీ ప్రతిపాదనను ఒప్పుకోమంది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని హైకోర్టుకు ఏజీ తెలిపారు. లేబర్ కోర్టులో ఉన్నందున ముగ్గురు జడ్జీల కమిటీ వద్దన్నారు. సమ్మెపై సుప్రీం కోర్టు ముగ్గురు మాజీ జడ్జిలతో కమిటీ వేస్తామని, ప్రభుత్వాన్ని అడిగి నిర్ణయం చెప్పాలని ఏజీని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టుకు… తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయం తెలపింది. హైకోర్టు ప్రతిపాదనకు నో చెప్పింది.
సమ్మె విషయంలో చర్చలు లేవన్న ప్రభుత్వం ఎస్మా ప్రకటించే ఆలోచనలో ఉండటంతో… అందుకు వీలు లేదని హైకోర్టు మంగళవారం తెలిపింది. ఆర్టీసీ సేవలు అత్యవసర సేవల కిందకు రాలేదనీ, అవి ప్రజా వినియోగ సేవలు మాత్రమేని పేర్కొంది. ఎస్మా ప్రయోగించాలంటే… ఆ సేవల్ని ఎస్మా కిందకు తెస్తూ… ప్రత్యేక ఉత్తర్వులు జారీ చెయ్యాలని తెలిపింది. అయితే, ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. 1998, 2015లో ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని చెప్పారు. దీంతో గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడు వర్తిస్తాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్ఆర్టీసీకి వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇక, 2015లో ఇచ్చిన జీవో ఆరు నెలలకే పరిమితం అని తేల్చి చెప్పింది.