హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిఎస్ ఎస్కె జోషి మంగళవారం పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తరువాత ఎవరు రానున్నారన్నది ఇప్పుడు ప్రధానాంశం. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త సిఎస్ ఎంపికలో ప్రధానంగా సీనియారిటీ, సమర్థతను పరిగణలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం ఈ రేసులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా ఉన్నారు. అయితే వీరిద్దరిలో 1985 బ్యాచ్కు చెందిన మిశ్రాకు సీనియారిటీ ఎక్కువ, కాకపోతే ఆయన వచ్చే జులైలో పదవీ కాలం ముగియనుంది. ఇక సోమేశ్ కుమార్కు సర్వీస్ ఇంకా మూడేళ్లు ఉంది. సోమేశ్కుమార్ పదవీకాలం 2023 డిసెంబరు వరకు ఉంది. దీంతో ఆరు నెలల్లో రిటైరయ్యే అజయ్ మిశ్రా కంటే మూడేళ్ల సర్వీస్ కలిగిన సోమేశ్ కుమార్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధికార వర్గాల తెలిపాయి. అయితే, వీరిద్దరిలో సిఎం కెసిఆర్ ఎవర్ని ఎంపిక చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు జోషి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మధ్యాహ్నం కొత్త సిఎస్ను ప్రభుత్వం ప్రకటించనుంది. కొత్త సిఎస్గా ఎంపికైన వారు ఈ సాయంత్రం నుంచి పదవీ బాధ్యతలు చేపడతారు.
సీనియారిటీలో ముందున్న అజయ్ మిశ్రాను అదృష్టం వరించనుందా? లేక ఆయన కంటే జూనియర్ సోమేశ్కుమార్ సిఎస్ కానున్నారా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా మారినప్పటికీ సోమేశ్కే అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో పరిణామాలు మారితే అజయ్ మిశ్రా ఆ పోస్టులోకి వస్తారని సమాచారం. 1984 బ్యాచ్ అధికారి అయిన ఈయనకు కీలక అధికారుల మద్దతుంది. కానీ, 1989 బ్యాచ్కు చెందిన సోమేశ్కుమార్కు సీఎం కేసీఆర్ ఆశీసులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే, వివాద రహితుడిగా పేరు, సీనియారిటీ పరంగానూ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తర్వాతి స్థానంలో అజయ్ ఉన్నారు. ఇక సోమేశ్ను రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించగా కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో సీఎం తన విచక్షణాధికారంతో సోమేశ్ను తీసుకునే అవకాశాలున్నాయి. అయితే అజయ్కి ఏడు నెలల సర్వీసే ఉన్నందున ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చి, తర్వాత సోమేశ్ను సీఎస్ చేయాలనే ప్రతిపాదనను కూడా సీఎం పరిశీలిస్తున్నట్లు సమాచారం.