(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విధుల్లో చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ఆర్టీసీ కార్మికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 5,100 ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సీఎం.. మిగతా సగాన్ని కూడా ప్రైవేటీకరించే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మెపై గురువారం హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో శుక్రవారం ఈ విషయమై కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 10,200 ప్రైవేట్ బస్సులకు సంబంధించి రూట్ మ్యాప్ను సిద్దం చేసినట్టు సమాచారం. మంగళవారం అర్ధరాత్రితో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం విధించిన గడువు ముగియడంతో బుధవారం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ వ్యూహాత్మకంగా ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. గురువారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో… కోర్టు తీర్పు తర్వాతి పరిణామాలను ఆయన పరిశీలించే అవకాశం ఉంది.
కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన రూట్లతోనూ ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు మరోసారి అవకాశం ఇచ్చినా.. విధుల్లో చేరకపోవడంతో మిగిలిన రూట్లతోనూ ప్రైవేటుకు పర్మిట్లు ఇచ్చే అంశంపై బుధవారం జరిగిన సమీక్షలో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రైవేటీకరణకే కేసీఆర్ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై చర్చించి, ప్రస్తుత నిబంధనల్లో స్వల్ప మార్పులు ప్రతిపాదించినట్లు సమాచారం. గురువారం హైకోర్టు విచారణ ఉన్న నేపథ్యంలో అదనపు పర్మిట్లపై నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడించే అవకాశం ఉంది. ఇదిఇలా ఉంటే.. విధుల్లో చేరిన కార్మికులకు భద్రత కల్పించాలని, బస్సులను యథాతథంగా నడపాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.