హైదరాబాద్: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై హైకోర్టులో మంగళవారం ప్రారంభమైన విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయం తప్పెలా అవుతుందని విచారణ సందర్భంలో హైకోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది. సెక్షన్ 102 ప్రకారం ఏ మార్పు చేసినా ఆర్టిసికి సమాచారం ఇవ్వాలని పిటిషన్ తరపు న్యాయవాది ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టిసికి ఎలాంటి నష్టం జరగదని సిఎం కెసిఆర్ చెప్పారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించగా సిఎం ఏమి చెప్పారనేది న్యాయస్థానానికి సంబంధం లేదని అభిప్రాయపడింది. కేబినెట్ నిర్ణయం చట్టబద్దమా, చట్ట విరుద్దమా అనేది న్యాయస్థానం ముందున్న అంశమని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఆర్టిసి రూట్ల ప్రైవేటీకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సికె జోషి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతోందా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రపంచం గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ కాలంలో ఉందని పేర్కొంది. గతంలో దేశంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే ఉండేదనీ, ఆ తరువాత చాలా ప్రైవేటు ఎయిర్ లైన్స్ విజయవంతమయ్యాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.