(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కోడిపందాలు తెలుగు సంప్రదాయ క్రీడల్లో ఒక భాగమనీ, దీన్ని జూదంగా చూడొద్దని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తలసాని పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలను తిలకించారు. జిల్లాలోని ఉండి మండలంలో ఏర్పాటు చేసిన కోడి పందాలకు ఆయన హాజరయ్యారు. కోడి పందాలపై తలసాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సంక్రాంతి పర్వదినాల్లో కోడిపందాలు ఎంతో కాలంగా ఒక ఆనవాయితీగా వస్తున్నాయనీ, అందుకే వీటిని ఎవరూ జూదంగా చూడరాదని ఆయన అన్నారు. కోడి పందాలు తెలుగు సంప్రదాయ క్రీడల్లో భాగమనీ, ఉభయ గోదావరి జిల్లాలలో సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరని అన్నారు. ఈ సందర్భంలో తలసాని పందెం పుంజులను చేతిలోకి తీసుకుని ఆనందించారు.
రాజకీయ విషయాలపై మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను ఏమి చెప్పానో ఫలితాలు అలానే వచ్చాయన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఫలితాలు అదే విధంగా ఉంటాయన్నారు. అయిదేళ్లలో ఏపి రాజధాని నిర్మాణం పూర్తి అయి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాజధాని అమరావతి ప్రాంత రైతులు కూడా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై నమ్మకం పెట్టుకుంటే వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. రైతులు, ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి జగన్ అని ఆయన రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందని అన్నారు.
ముందుగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, భీమవరం నాయకులు పాతపాటి నర్రాజు తదితరుల ఆధ్వర్యంలో స్థానిక నేతలు తలసానిని ఘనంగా సత్కరించి తులాభారం నిర్వహించారు.