హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికల్లో వారం రోజులుగా వివిధ పార్టీలు హోరెత్తుతున్న ప్రచారం సోమవారంతో ముగియనుంది. ఈ నెల 22న ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచార గడువు ముగియనుంది. దీంతో గత వారం, పది రోజులుగా పట్టణాలు, నగరాల్లో మోగిన మైకులు మూగబోనున్నాయి. ఒక్కరోజు మాత్రమే గడువుండటంతో ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాత్రి వేళల్లో ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు. పోలింగ్కు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు పలు రూపాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఇక 24న పోలింగ్ జరిగే కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రచారానికి ఈ నెల 22 సాయంత్రం వరకు గడువు ఉంది. ఎన్నికల సందర్భంగా మునిసిపాలిటీల్లో మద్యం దుకాణాలు మూసి వేయాలని పోలీసులు ఆదేశించారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ నెల 22న సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఈ నెల 25న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు వెలువడనున్నాయి.
ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర విమర్శనాస్త్రాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పట్టణాల్లో తిరిగారు. రోడ్ షోలు, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా పట్టణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోని వార్డులు, డివిజన్లలో అభ్యర్థులను వెంటపెట్టుకొని ప్రజలను ఓట్లడిగారు. అధికార టీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలే అన్ని బాధ్యతలు తీసుకొని ప్రచారం నిర్వహించారు.
మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచార శైలిని పర్యవేక్షిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలిస్తూ ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. టీఆర్ఎస్ ఈ ఆరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలపై విమర్శలు సంధించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఇక బీజేపీ పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు పర్యటించగా ఎమ్మెల్యే రాజాసింగ్తోపాటు ఇతర కీలక నేతలు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. వారితోపాటు స్థానిక నేతలు కూడా పెద్ద ఎత్తున బీజేపీ పక్షాన ప్రజల వద్దకు వెళ్లారు. ఎంఐఎం తరఫున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా వామపక్షాలు, టీజేఎస్ తదితర పార్టీల నేతలు కూడా ప్రచారం నిర్వహించారు.