హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణలో భాగంగా కోడెల కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీ ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. కేసుకు సంబంధించి తమ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోడెల తనయుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీలకు గతంలో బంజారాహిల్స్ నోటీసులు జారీ చేశారు. అయితే, వారిద్దరి పోలీసుల నోటీసులకు స్పందించలేదు. పోలీసు విచారణకు కూడా హాజరుకాలేదు. దీంతో గుంటూరుకు వెళ్లి వారిని విచారించాలని బంజారాహిల్స్ పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. అక్కడే వారిద్దరిని ప్రశ్నించనున్నారు. శివప్రసాదరావు మరణానికి కారణాలు.. కాల్ డేటాతో పాటూ మిగిలిన అంశాలపై వారి నుంచి సమాచారం సేకరించనున్నారు. మరో రెండు మూడు రోజుల్లో పోలీసులు గుంటూరు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాదులోని నివాసంలో ఉరి వేసుకుని కోడెల బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆత్మహత్య కేసు విచారణను తెలంగాణ పోలీసులు చేపట్టారు. కుమారుడు, కుమార్తె కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందని రాజకీయవర్గాల్లో ఆరోపణలు వినిపించడంతో… ఈ కేసు విచారణలో వారి వాంగ్మూలం కూడా కీలకం కానుంది. మరోవైపు అసెంబ్లీ ఫర్నీచర్, అక్రమ వసూళ్ల సహా పలు కేసుల్లో శివరాం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు కేసులో మంగళగిరి కోర్టు కోడెల శివరాంకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.