హైదరాబాద్: ఆర్టిసి సమ్మె నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురైన ఆర్టిసి డ్రైవర్ ఆవుల నరేష్ ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరేశ్ మృతి చెందాడు. మృతుడికి భార్య పూలమ్మ, కుమారులు శ్రీకాంత్, సాయి కిరణ్ ఉన్నారు.
భార్య గత అయిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోందనీ. ఆమె మందులకు నెలకు సుమారు అయిదు వేల రూపాయలు ఖర్చవుతున్నాయనీ, మరో వైపు పిల్లల చదువులతో నరేశ్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడనీ సహచర ఉద్యోగులు తెలుపుతున్నారు.
నరేశ్ ఆత్మహత్య వార్త తెలియడంతో కార్మికులు, అఖిలపక్ష నేతలు, పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. నరేశ్ మృతదేహాన్ని డిపోకు తరలించేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
2007 నుండి నరేశ్ ఆర్టిసి డ్రైవర్గా పని చేస్తున్నాడు.