హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 9న హైదరాబాద్లో ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము నిర్వహించబోయే మిలియన్ మార్చ్కు బీజేపీ మద్దతు తెలిపిందన్నారు. మిగితా పార్టీలతో పాటు ఉద్యోగ, ప్రజా సంఘాల మద్దతును కూడగడతామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడైనా దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్ని డెడ్లైన్లు పెట్టినా ఎవరూ విధుల్లో చేరేందుకు ముందుకు రాలేదన్నారు. సీఎం కేసీఆర్ డెడ్లైన్కు ఒక్క కార్మికుడూ స్పందించలేదన్నారు. మంత్రుల వాహనాల్లో తీసుకెళ్లి విధుల్లో చేర్పించినా…కార్మికులు మళ్లీ వెనక్కి వస్తున్నారని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని ఆయన చెప్పారు. కేంద్రం అనుమతి లేకుండా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు గుర్తింపు సంఘాలు, ఆర్టీసీ బోర్డుతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ప్రభుత్వంతో చర్చలకు ఆర్టీసీ జేఏసీ సిద్ధంగా ఉందన్నారు. చట్టబద్ధత ఉంటే…అటెండర్ కమిటీతోనైనా చర్చిస్తామన్నారు. సమ్మెను జఠిలం చేయొద్దని సీఎంను అశ్వత్థామరెడ్డి కోరారు.
తెలంగాణలో పరిపాలన సంక్షోభంలో పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఈనెల 9న ‘మిలియన్ మార్చ్’కు బీజేపీ మద్దతు ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం సమ్మెను పరిష్కరించే ఆలోచన చేయడం లేదని, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణం సీఎం కేసీఆరేనని విమర్శించారు. కేంద్రం చేసిన చట్టం తమకు అవసరం లేదని.. టీఆర్ఎస్ మంత్రులు అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకునేలా సీఎం తీరు ఉందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011 మార్చి 10న ‘మిలియన్ మార్చ్’ నిర్వహించారు. ఆంక్షల పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టుకుని లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ జనంతో ఆరోజు ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా.. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. ఆనాడు ‘మిలియన్ మార్చ్’ ధాటికి పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు. ఇంతటి నేపథ్యమున్న ‘మిలియన్ మార్చ్’ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.