(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం.. ఆర్టీసీ టికెట్ ఛార్జీల పెంపు ప్రకటనతో ప్రయాణికులపై కొంత భారం మోపింది. ఆర్టీసీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఛార్జీలు పెంచక తప్పడం లేదని, ఆర్టీసీ టికెట్ ఛార్జీలను కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీని పరిరక్షించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. గత రెండు నెలలుగా ఆర్టీసీ బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఇది కొంచం చేదు వార్తే.
ఆర్టీసీని ఆదుకోవడానికి తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం… సంస్థ మనుగడ కోసం కిలోమీటరుకు 20 పైసల చొప్పున ఛార్జీలను పెంచేందుకు నిర్ణయించింది. పెరిగిన ఛార్జీలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 100 కి.మీ. దూరానికి రూ.20 చొప్పున ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. ఛార్జీల పెంపుదల ద్వారా రూ.760 కోట్ల అదనపు ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు.
నిజానికి గత నాలుగున్నరేళ్లుగా ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం పెంచలేదు. ఆర్టీసీ నష్టాల్లో డీజిల్ ధరలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీనికి తోడు రెండు నెలలుగా కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో నష్టాలు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఛార్జీల పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, తొలిసారి అన్ని సర్వీసుల్లో ఒకే మొత్తంలో 20 పైసలు పెంచనుంది. ఛార్జీల పెంపుదలపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కసరత్తు చేశారు. అయితే శాతాల్లో ఆర్టీసీ ఛార్జీలను పెంచితే ప్రయాణికులకుపై మరింత భారం పడుతుందని అప్పట్లోనే అంచాన వేశారు. 20 పైసలకు మించి ఛార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులపై ఎక్కవ భారం పడకుండా అన్ని సర్వీసులపై ఒకే మొత్తంలో 20 పైసలు పెంచాలని నిర్ణయించింది.
సమ్మెలో పాల్గొన్న దాదాపు 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు తిరిగి శుక్రవారం విధుల్లో చేరారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు, తెల్లవారుజాము నుంచే డిపోల వద్ద బారులు తీరారు. విధుల్లో చేరి… తమ బస్సులను రోడ్డెక్కించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.