హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసిఆర్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ సమస్యలపై కూడా చర్చించారు. నిధుల పంపకాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను ఈ రోజు రేపు అధ్యయనం చేయాల్సిందిగా ప్రదాన కార్యదర్శులను కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు.
రోజంతా జరిగిన సమావేశం అనంతరం తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్తో కలిసి ప్రగతి భవన్లో బుగ్గన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా గోదావరి నదుల్లో మిగులు జలాలపై జూలై 15వ తేదీ లోగా తాత్కాలిక నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
సుహృద్బావ వాతావరణంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయనీ, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించామనీ ఆయన అన్నారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలులోని అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.
ఘర్షమ వాతావరణం లేకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రజల కోసం పని చేయాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారని ఈటెల రాజేందర్ అన్నారు.