మహేశ్వరం: డిపో మేనేజర్ వేధిస్తున్నారంటూ మహేశ్వరం డిపో వద్ద ఉదయం నుండి తాత్కాలిక కార్మికులు ధర్నా చేపట్టారు. డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళకుండా భైటాయించి ఆందోళన చేశారు. రోజుకు 1750 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఆదాయం రాకుంటే కేవలం 900 రూపాయలే ఇస్తున్నారని తాత్కాలిక కార్మికులు ఆరోపించారు.
అధికంగా డీజిల్ ఖర్చు అవుతోంది, దానికి తగిన విధంగా ఆదాయం రావడం లేదని డిఎం రవిందర్ అంటున్నారని కార్మికులు పేర్కొంటున్నారు. రోజుకు 2 లక్షల రూపాయల ఖర్చు అవుతుంటే అదాయం మాత్రం 50 వేల రూపాయలే వస్తుందని డిఎం వేధిస్తున్నారనీ, ఇలా వేధింపులకు గురి చేస్తే తాము డూటీలకు వెళ్లమని కార్మికులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డిఒ డిఎంకు చివాట్లు పెట్టారు. ‘ఎన్ని డబ్బులు వస్తే నీకేంటీ, ముఖ్యమంత్రి రూపాయ రాకున్నా బసులు నడపమన్నారు’ అని ఆర్డిఒ డిఎంతో అంటూ మందలించారు. అవసరమైతే సస్పెండ్ చేయిస్తానంటూ హెచ్చరించారు. ఆర్డిఒ హెచ్చరికలతో డిఎం తెల్లమోహం వేశారు.