అమరావతి: ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం తీవ్రదూరం దాలుస్తోంది. రైతుల ఆందోళనలు శుక్రవారంతో పదో రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రతిగ్రామ కూడలిలో ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. సచివాలయం చుట్టుపక్కల పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను ఇప్పటికే రంగంలోకి దింపారు.
సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి మందడం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మందడంలో దుకాణాలు తెరవడానికి పోలీసులు అంగీకరించడం లేదు. వీఐపీ రాకపోకలు పూర్తి అయ్యేవరకు దుకాణాలు తెరవొద్దని పోలీసులు ఆదేశించారు. మెడికల్ దుకాణాలను కూడా మూయించేయడంతో మందులు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే, దుకాణాలు తెరుచుకుంటే ఇబ్బంది ఏంటని యజమానులు ప్రశ్నిస్తున్నారు. షాప్లు తెరవక పోతే తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందడంలో రైతులు రోజూ ధర్నా చేసే ప్రదేశంలో వాహనాలు, బారికేడ్లను పోలీసులు అడ్డుగా పెట్టారు. సచివాలయం వైపు ఎవరినీ అనుమతించడం లేదు.
వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. ఉద్దండరాయినిపాలెం శంకుస్థాపన ప్రదేశంలో ఉదయం నుంచి రైతులు నిరసన తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో రైతులు ఆందోళన నిర్వహించారు. అమరావతి నుంచి రాజధాని మార్చొద్దంటూ అని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ప్రైవేట్ బస్సు అద్దాలు పగలగొట్టారు.
మరోపైపు మూడు రాజధానుల విధానంపై మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో విజయవాడలోని టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలను పోలీసులు ఈ ఉదయం ఇంటి నుంచి కదలనివ్వలేదు. వీరు ప్రకాశం బ్యారేజ్ వద్ద ‘రాజధాని పరిరక్షణ సమితి’ పిలుపునిచ్చిన నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరగా, వారిని నిలువరించారు. పలువురు స్థానిక నేతలను కూడా పోలీసులు నిన్నటి నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు.