అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం మందడం వద్ద రైతుల దీక్షలకు మద్దతుగా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులును పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వెళ్లే మార్గానికి ముళ్ల కంచె వేసి ర్యాలీని అడ్డుకున్నారు. అయితే, పోలీసులను నెట్టుకుంటూ ముందుకు దూసుకుపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రోడ్డుపైనే భైఠాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయం మార్గానికి ముళ్ల కంచె వేయడంతో విద్యార్థులంతా మందడం వైపు ర్యాలీగా వెళ్లారు. రైతుల దీక్షలో కూర్చుని ఆందోళన చేస్తున్నారు.
మందడంలో రైతులు రోడ్డుపై భైఠాయించి.. నిరసనలో భాగంగా మహాధర్నా చేస్తున్నారు. రైతుల ధర్నాకు విట్ కళాశాల విద్యార్థులు మద్దతు పలికారు. తమ ఉన్నత భవిష్యత్తు కోసమే రైతులు త్యాగాలు చేశారని, ఒక రాజధాని పూర్తికాకుండా మూడు రాజధానులు అభివృద్ధి అసాధ్యమని నినదించారు. ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకునే వరకు రైతులకు మద్దతుగా పోరాడతామని స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. తూళ్లూరులో ధర్నా చేసేందుకు పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి ప్రాంతంలో ధర్నాలు చేస్తున్న రైతులకు పలువురు నేతలు మద్దతు తెలుపుతున్నారు