(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి అంశంపై రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేపట్టాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలతో విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. పోలీసు ఆంక్షలతో నిమిత్తం లేకుండా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు జరపాలని అమరావతి పరిరక్షణ జేఏసీ నిర్ణయించింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో బెంజ్ సర్కిల్ నుంచి ర్యాలీగా జేఏసీ నేతలు వెళ్లనున్నారు. మచిలీపట్నం కోనేరు సెంటర్లో మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
బుధవారం రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో వివిధ పార్టీల నేతలతో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాలను ఐదు భాగాలుగా విభజించి ఐదు బృందాలను పంపాలని జేఏసీ నిర్ణయించింది. ప్రత్యమ్నాయం చూసుకొని గురువారం అన్ని జిల్లాలకు ఈ బృందాలను పంపాలని జేఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఒక బృందం గురువారం మచిలీపట్నంలో సభ నిర్వహించాల్సి ఉంది. దాని వెంట తానూ వెళ్లి మచిలీపట్నం సభలో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఇతర పార్టీల నేతలు ఆయన నిర్ణయాన్ని ఆమోదించారు. జేఏసీ బస్సు యాత్రకు అడ్డుకోవడంపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జేఏసీ పిలుపునిచ్చింది.
అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రను బుధవారం రాత్రి పోలీసులు అడ్డుకొన్న సంగతి తెలిసిందే. బస్సు యాత్రకు ముందు బెంజ్ సర్కిల్ వద్ద ఒక ఫంక్షన్ హాలులో జెఎసి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు బెంజ్ సర్కిల్లో బైఠాయించారు. పాదయాత్రకు పోలీసులు నిరాకరించడంతో ఆయనతో పాటు, ఇతర పార్టీల నేతలు కూడా ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళన విరమించాలని పోలీసులు చంద్రబాబుని కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, నారా లోకేశ్, ఇతర టీడీపీ నేతలను, సీపీఐ, కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని ఉండవల్లి తరలించారు. అరెస్ట్ చేసిన జేఏసీ నేతలందరినీ పోలీసులు ఉండవల్లి తరలించి, చంద్రబాబు నివాసం వద్ద విడిచిపెట్టారు.