స్వతంత్ర భారత చరిత్రలో ఇంత దీర్ఘకాలం పాటు ఎన్నికల ప్రక్రియ సాగడం ఇదే ప్రధమమేమో! ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి చూస్తే ఇప్పటికి రెండు నెలల పది రోజులకు పైగా అయింది. మొదటి దశ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి చూసినా చివరిదైన ఏడవ దశ పోలింగ్ రెండు నెలల తర్వాత జరిగింది. ఇంత కాలం ఎదురు చూసినందుకు కాబోలు 19వ తేదీన చివరిదశ పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు జనం ఎగబడ్డారు.
పరస్పరం నిజంగానే కత్తులు దూసుకుంటున్నారా అన్నంతగా అధికారపక్షానికీ, ప్రధాన ప్రతిపక్షానికీ పోటీ జరిగిన ఆంద్రప్రదేశ్లో అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం మరీ ఎదురు చూశారు. ఆ రెండు పార్టీల మధ్యే అనుకుంటే వాటికి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన తోడయింది. ఏమయితేనేం మొత్తం మీద ఎగ్జిటి పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. కొందరికి ఖేదం, కొందరికి మోదం మిగిల్చాయి. అనుకున్న విధంగా ఫలితాలు లేవని ఆశాభంగం చెందినవారు, అసలు ఫలితాలు ఎటూ వస్తాయిగా, అప్పుడు తేడా రాకపోతుందా అని సరిపెట్టుకుంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఇది మనకు తెలిసిన వ్యవహారం. మనకు తెలియని వ్యవహారం చాలా ఉంది. మొదటి విషయం అసలు ఈ సర్వేలు నిర్వహించే సంస్థలకు అందుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయా అన్నది. ప్రజాభిప్రాయం తెలుసుకునే సర్వేలు నిర్వహించడం అన్నది కూడా ఒక సైన్స్లో భాగం. దానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన సర్వే సిబ్బంది, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కావాలి. సర్వే లోకి వచ్చే వివిధ అశాలపై ఆధారపడి సర్వేకు అవసరమైన మెథడాలజీ నిర్ణయించుకోవడానికే చాలా నిపుణత కావాలి.
ఇవాళ ఇండియాలో ఈ అన్ని అర్హతలూ ఉన్న సంస్థలు ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎక్కువ ఉన్నందుకు కాదు, ఆ బ్రాకెట్లోకి ఒకటి రెండు సంస్థలన్నా వస్తాయా అన్న అనుమానంతో. అన్నీ పద్ధతి ప్రకారం సర్వే చేసే సంస్థలే అని కాసేపు మాటవరసకు అనుకున్నా, ఇండియాలాంటి వైవిధ్యభరిత దేశంలో, ఇండియా లాంటి బహళపార్టీ వ్యవస్థలో ఎన్నికల సర్వేలు ఖచ్చితంగా చేయడం చాలా కష్టం. గత అయిదేళ్లలో ఎన్ని సర్వేలు గురి తప్పాయో చూస్తే ఇది ఎంత కష్టమో అర్ధమవుతుంది.
ఈ ప్రకారం పేరున్న సంస్థలనే పరిగణనలోకి తీసుకోవడం కష్టం. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా, ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవాలన్న రాజకీయపార్టీలు, రాజకీయనాయకుల ఉబలాటాన్ని క్యాష్ చేసుకునేందుకు సర్వేల సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. వీటిని నడిపే వారికి ఈరంగంలో ఓనమాలు కూడా తెలియవు. పది మంది అభిప్రాయాలు అడిగి తెలుసుకుని వాటిని క్రోడీకరించడం సర్వే అనుకుంటున్నారు. ఇలాంటి ‘సర్వేయర్ల’లో జర్నలిస్టులు కూడా ఉన్నారు.
లగడపాటి రాజగోపాల్ ఎందుకు సర్వే చేయిస్తారో ఎప్పుడన్నా ఆలోచించారా? ఆయనకూ ఎన్నికలకూ ఏమిటి సంబంధం? ఎన్నికల ఫలితాల ముందు ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటపెట్టాల్సిన అవసరం ఆయనకేమిటి? తన వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పుల పాలు చేసి కుప్పకూల్చి, దాని పర్యవసానంగా అనేకమంది ఏడుస్తుంటే ఆయన సర్వేలు చేయడం ఏమిటి? పైగా ఆంధ్రా ఆక్టోపస్ అని బిరుదు ఒకటి!
ఇలాంటివారి వల్ల, వీరి శాస్త్రీయత లేని సర్వేల వల్ల బెట్టింగ్ల రూపంలో చాలామంది చాలా నష్టపోతున్నారు. కొంపలు కూలుతున్నాయి. సర్వేల గురించి మనకు తెలియనిది చాలా ఉందన్నాను చూడండి, ఇది అందులో ఒకటి. బెట్టింగ్లను మాత్రమే దృష్టిలో ఉంచుకుని సర్వే అంచనాలు రూపొందిస్తే అది ఎవరికి తెలియదు కదా! సర్వే అంచనాలు ఆతర్వాత బారెడు దూరంలో గురి తప్పినా ఎవరూ జవాబుదారీ కాదు కదా!
జూదగాళ్లు ఎవరికి వారు తామే గొప్ప అనుకుంటారు. పేకాటలో ఫలానావాళ్లు బాగా సంపాదించారని మనం అప్పుడప్పుడూ వింటుంటాం. అది మిధ్య, పెద్ద మాయ. పేకాటలో సంపాదించేద ఒక్కడే. అది నలుగురితో పేకాట ఆడించేవాడు. ఆడించేవాడే రాజు, ఆడేవాళ్లంతా బికారులు. అలాగే బెట్టింగ్ చేసేవారు చివరికి సంపాదించేది సున్నా. బెట్టింగ్ నడిపే సట్టా కింగ్దే డబ్బంతా. ముందస్తు సర్వేలు వారి కోసమే.
ఈ నెల 19వ తేదీ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలు వచ్చాయి. ఆరోజు ఆదివారం. మరుసటి రోజు స్టాక్ మార్కెట్లు ఓపెన్ అయ్యాయి. భారీగా షేర్ల లావాదేవీలు జరిగాయి. ఆ రోజు గత పదేళ్లలోనే అత్యధికంగా సెన్సెక్స్ 1421 పాయింట్లు పెరిగింది. ఇంతవరకూ మనకు తెలిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సెన్సెక్స్ ఎందుకు స్పందించాలి? మోదీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం మళ్లీ వస్తుందంటే మదుపర్లకు ఎందుకు ఉత్సాహం?
తెలియంది ఏమిటంటే, ముందు శుక్రవారం మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో చక్రం తిప్పే ఘరానా స్టాక్ బ్రోకర్లు పెద్ద ఎత్తున ఎంపిక చేసిన షేర్లు కొనిఉంటారు. మరుసటి రోజు శనివారం స్టాక్ మార్కెట్కు సెలవు. ఆదివారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. తెల్లారగానే సోమవారం సెంటిమెంట్ పేరుతో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల ముందు తాము కోనుగోలు చేసిన షేర్లు విక్రయించిన తర్వాత ఆ ఘరానా బ్రోకర్లు ఎన్ని వందల కోట్ల రూపాయలు జేబులో వేసుకుని ఉండాలి!
ఇక మీడియా సంగతి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వస్తున్నాయంటూ చాలా రోజుల ముందు నుంచే జాతీయ ఛానళ్లుగా చలామణీ అయ్యే ఉత్తరాది న్యూస్ ఛానళ్లు ఊదరగొట్టడం మొదలుపెట్టాయి. ఆ రోజున సాయంత్రం నాలుగింటి నుంచే పేరు మోసిన యాంకర్లు విశ్లేషణలు ప్రారంభించారు. ఈ ఛానళ్లలో దాదాపుగా అన్నీ కూడా సర్వేలు చేయించినవే. ఒక్కో ఛానల్ సర్వే ఫలితాలు ఒక్కోరకం. ఏ ఛానల్ సర్వేను నమ్మాలి? దానికన్నా ముఖ్యంగా ఛానల్ విశ్వసనీయత ఎంత? ఎవరితోనన్నా కుమ్మక్కు కాలేదన్న హామీ ఏదీ? తెర వెనుక సంగతి అలా ఉంచితే తెర ముందు ప్రకటనల రూపంలో బోలెడు ఆదాయం.
చివరికి అసలు ఫలితాలు వచ్చిన తర్వాత సర్వేలు తప్పులతడకలుగా తేలితే ఎవరినీ ఎవరూ అదేమనేందుకు వీలు లేదు. ఎవరూ జవాబుదారీతనం తీసుకోరు. సర్వే అంచనాల మంచిచెడ్డలకు సర్వే చేసినవారు, చేయించిన వారూ కూడా జవాబుదారీ కానపుడు దీనిని ఇలాగే కొనసాగనివ్వడం అన్యాయం కదూ? సర్వే చేసే సంస్థలు ఎక్కువ శాతం పనికిరానివని ప్రభుత్వాలకు తెలుసు. కానీ ప్రభుత్వాలు నడిపే పార్టీలు కూడా ఈ ఆటలో భాగస్వాములే కదా! అందుకే గాలప్, ప్యూ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను ఇండియాలో సర్వేలకు దూరంగా ఉంచుతున్నారు. దానాదీనా బకరా ఎవరంటే సామన్య జనం.
-ఆలపాటి సురేశ్ కుమార్