రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందన్న అభియోగాల నేపధ్యంలో ‘ది హిందూ’ దినపత్రిక శుక్రవారం నాటి సంచికలో సంచలన కధనం ప్రచురించింది. ఒకపక్క రక్షణ శాఖ బృందం ఫ్రాన్స్ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతుండగా ప్రధాని కార్యాలయం అధికారులు సమాంతరంగా చర్చలు జరపడం పట్ల రక్షణ శాఖ అధికారులు అభ్యంతంర వ్యక్తం చేశారన్నది ఆ కధనం సారాంశం.
‘ద హిందూ’ కథనం లోని ముఖ్యాంశాలు.
రఫేల్ ఒప్పందంపై జోరుగా చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రధాని కార్యాలయం అధికారులు విడిగా సమాంతరంగా చర్చలు జరపడం పట్ల రక్షణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.
దాని వల్ల ఒప్పందం చర్చలకు సంబంధించి ఇండియా పరిస్థితి బలహీనపడిందని 2015 నవంబర్ 24న రక్షణ శాఖ ఒక నోట్ ద్వారా ఆనాటి రక్షణ మంత్రి మనోహర్ పరికర్కు తెలిపింది.
ఒకవేళ రక్షణశాఖ బృందం పనితీరు పట్ల ప్రధాని కార్యాలయం అసంతృప్తిగా ఉన్నట్లయితే పిఎంఒ ఆధ్వర్యంలో చర్చలు జరిగేలా చర్చల విధివిధానాలను మార్చాలని రక్షణ శాఖ పేర్కొన్నది.
గత అక్టోబర్లో సుప్రీంకోర్టులో కేంద్రం సమర్పించిన అఫిడవిట్లో వైమానిక దళ ప్రధానాధికారి నాయకత్వంలోని ఏడుగురు సభ్యుల రక్షణ శాఖ బృందం రఫేల్ ఒప్పందం చర్చలు జరిపిందని తెలిపారు. ప్రధాని కార్యాలయం ప్రస్తావన అందులో లేదు.
పిఎంఒ జోక్యం మానాలనీ, లేని పక్షంలో చర్చల్లో రక్షణ శాఖ బృందం పరిస్థితి బలహీనపడుతుందనీ రక్షణ శాఖ కార్యదర్శి (ఎయిర్ 2) స్వయంగా నోట్పై రాశారు.
రఫేల్ ఒప్పందం విషయంలో ప్రధాన మంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంటున్న విషయం రక్షణ శాఖకు ఫ్రాన్స్ వైపు నుంచి కాకతాళీయంగా తెలిసింది తప్ప ప్రధాని కార్యాలయం నుంచి కాదు.
సమాంతర చర్చల వల్ల ఇండియా పరిస్థితి బలహీనపడిందనేందుకు ఒక ఉదాహరణ నోట్లో పేర్కొన్నారు. ఫ్రాన్స్ రక్షణ మంత్రికి సలహాదారు జనరల్ రెబ్తో ప్రధాని కార్యాలయంలోని సంయుక్త కార్యదర్శి జావేద్ అష్రఫ్ చర్చలు జరిపారు. ఆ చర్చల దరిమిలా రఫేల్ కంపెనీ ఇండియాకు బ్యాంక్ గ్యాంరటీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయిన విషయం జనరల్ రెబ్ లేఖలోనే ఉందని నోట్లో పేర్కొన్నారు.
నిజానికి సమాంతర చర్చలు జరగడం ఇది మొదటిసారి కాదు. 2016 జనవరిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్ అధికారులతో చర్చించిన విషయం గతంలోనే బయటకు వచ్చింది. ఒప్పందానికి ఫ్రాన్స్ ప్రభుత్వం పూచీ పడాలి లేదా రఫేల్ కంపెనీ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలన్న షరతు ఉపసంహరించుకోవాలని దోవల్ రక్షణ మంత్రి పరికర్కు సలహా ఇచ్చారు.