‘ప్రియాంకా గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో నవ్వుతోంది. రాబందులు’, అంకుర్ సింగ్ అనే ట్విట్టర్ ఖాతాదారుడు చేసిన పోస్టు ఇది. దానితో పాటు 11 సెకన్ల వీడియో కూడా పోస్టు చేశారు. ఈ అంకుర్ సింగ్కు మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటే అతనిని ఫాలో అయ్యేవారిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు.
40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా టెరరిస్టు దాడి నేపధ్యంలో అంకుర్ సింగ్ ఈ ట్వీట్ పోస్టు చేశారు. దానికి జత చేసిన వీడియోలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ బహుత్ బహుత్ ధన్యవాద్ అంటూ లేచి నుంచోవడం కనబడుతుంది.
Priyanka Vadra was laughing at press conference ??
Such vultures pic.twitter.com/hVSWWWfuiu
— Ankur Singh (@iAnkurSingh) February 14, 2019
పుల్వామా టెరరిస్టు దాడిలో ప్రాణాలు అర్పించిన జవాన్లకు దేశమంతా నివాళులు అర్పిస్తుంటే ప్రియాంకకు నవ్వులాటగా ఉందని చెప్పడం అంకుర్ సింగ్ పోస్టు ఉద్దేశం. నిజంగా ప్రియాంకా గాంధీ అక్కడ నవ్వడం జరిగిందా?
అంకుర్ సింగ్ పోస్టు చేసిన 11 సెకన్ల వీడియో, ప్రియాంకా గాంధీ అమర జవాన్లకు నివాళులు అర్పించిన మీడియా సమావేశం వీడియోలో భాగం. నిజానికి రాజకీయపరమైన విషయాలు మాట్లాడేందుకే ప్రియాంక ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచారు. ఈ మధ్యలో పుల్వామా దాడి వార్త తెలిసింది. దానితో ప్రియాంక మీడియా సమావేశం వాయిదా వేశారు.
‘పుల్వామా దాడి నేపధ్యంలో మనం రాజకీయాలు మాట్లాడడం ఉచితం కాదు. దాడిలో ప్రాణాలు అర్పించిన జవాన్లకు నివాళులు అర్పిస్తూ యావత్తు దేశం వారి కుటుంబాలకు అండగా ఉందని చెప్పదలచుకున్నాను’, అంటూ ఆమె ‘బహుత్ బహుత్ ధన్యవాద్’తో ముగించి లేచారు. తర్వాత అమర జవాన్లకు నివాళిగా రెండు నిముషాల సేపు మౌనం పాటించారు.
ఈ సన్నివేశం వీడియో నుంచి 11 సెకన్ల ముక్క తమకు కావల్సినట్లు కత్తిరించి ప్రియాంక నవ్వుతున్నట్లు చిత్రించేందుకు ప్రయత్నించారు. మొత్తం వీడియో చూస్తే ప్రియాంక ఎక్కడా గానీ నవ్వుతున్నట్లు లేనే లేదని అర్ధం అవుతుంది.
ఈ ట్వీట్ చేసిన అంకుర్ సింగ్ను ట్విట్టర్లో నరేంద్ర మోదీ ఫాలో అవుతారు. ఇటీవల అంకుర్ సింగ్ ‘మిర్రర్ నౌ’ ఛానల్లో టెక్ నిపుణుడిగా చర్చలో కూర్చున్నారు. ఆ చర్చలో ఆయన మితవాద భావజాలం ఉన్నవారి ఎక్కౌంట్లను ట్విట్టర్ చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. అంకుర్ ట్విట్టర్ ఎక్కౌంట్ను ఇటీవలే సస్పెండ్ చేసి తర్వాత పునరుద్ధరించారు.
ఆల్ట్ న్యూస్ వెబ్సైట్ ఆధారంగా